
28న కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం..19 పార్టీలు బాయ్ కాట్
- NewsPoliticsTelangana Politics
- May 25, 2023
- No Comment
- 73
నూతన పార్లమెంట్ భవనం ఓపెనింగ్ పై పెద్ద పంచాయితీ నడుస్తోంది. సెంట్రల్ విస్టా ప్రారంభోత్సవంపై అధికార, ప్రతిపక్షాల మధ్య రగడతో ఢిల్లీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఈనెల 28న నూతన పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా ప్రారంభించనున్నారు. అయితే, ప్రధాని మోడీ చేతుల మీదుగా జరగనున్న ఈ కార్యక్రమాన్ని తప్పుబడుతూ విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. రాష్ట్రపతిని పక్కనబెట్టి మోడీ రిబ్బను కటింగు ఎలా చేస్తారంటూ మండిపడుతున్నారు విపక్ష నేతలు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు కాంగ్రెస్ సహా 19 పార్టీలు కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు ఉమ్మడి లేఖను విడుదల చేశాయి. రాష్ట్రపతి చేతులమీదుగా జరగాల్సిన కార్యక్రమాన్ని మోడీ ప్రారంభించాలనుకోవడం… ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించాయి విపక్షాలు .
వచ్చే ఎన్నికల్లో మోడీ సర్కార్ ను గద్దెదించడమే లక్ష్యంగా బీజేపీయేతర పక్షాలన్నీ ఏకమవుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో విపక్షాల్లో ఐక్యత మరింత బలపడుతోంది. ఈ క్రమంలోనే కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం విషయంలోనూ మరోసారి విపక్షాలు ఏకతాటిపైకి రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే, పార్లమెంట్ మోడీ సొంత వ్యవహారం కాదంటూ విరుచుకుపడుతున్న విపక్షాలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. కొత్త పార్లమెంట్ భారత ప్రజలకు గర్వకారణమని, రాజకీయం చేయడం తగదని విపక్ష నేతల తీరును తప్పుబడుతున్నారు కమలనాథులు. 2020 డిసెంబర్ లో కూడా కొత్త పార్లమెంట్ నిర్మాణ శంకుస్థాపన పనులను ప్రతిపక్షాలు బహిష్కరించాయి.
తక్కువ కాలంలో చరిత్రలో గుర్తుండిపోయేలా సెంట్రల్ విస్టా నిర్మాణం జరిపారు. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనులు 2021 జనవరిలో ప్రారంభమయ్యాయి. నాలుగు అంతస్తుల ఈ భవన డిజైన్ను ‘హెచ్సీపీ డిజైన్’ సంస్థ రూపొందించగా, టాటా ప్రాజెక్ట్స్ సంస్థ దీన్ని నిర్మించింది. ప్రస్తుత పార్లమెంట్ కంటే ఇందులో సీట్ల సంఖ్యను పెంచారు. కొత్త పార్లమెంట్ నిర్మాణానికి దాదాపు రూ. 970 కోట్లు ఖర్చు అయినట్లు అంచనా. ఈనెల 28న జరగనున్న కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నేతలు, లోక్సభ, రాజ్యసభ ఛైర్మన్లకు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఉభయ సభల ఎంపీలకు భౌతిక, డిజిటల్ రూపాల్లో ఆహ్వానాలు అందాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలకు కూడా ఇన్విటేషన్స్ పంపిచారని చెబుతున్నారు.
మొత్తంగా, రాష్ట్రపతిని కాదని మోడీ ముందుకెళ్తే సెంట్రల్ విస్టా అంశాన్ని రాజకీయంగా మలుచుకోవాలనే ఎత్తుగడతో విపక్ష పార్టీలు కనిపిస్తుండగా.. ప్రత్యర్థుల విమర్శలను పెద్దగా పట్టించుకోని కమలనాథులు మోడీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఓపెనింగ్ కు గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారు.