
మంగళగిరి వైసీపీలో రాజుకున్న ముసలం.. జగన్ పై ఆళ్ళ తిరుగుబాటు..?
- Ap political StoryNewsPolitics
- April 4, 2023
- No Comment
- 34
ఏపీ సీఎం జగన్ రెడ్డికి.. వైసీపీ ఎమ్మెల్యేలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఆయన వ్యవహారశైలి నచ్చని నేతలు.. తమ దారి తాము చూసకుంటున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా వైసీపీలో మొదలైన ముసలం.. ఇప్పుడు గుంటూరు జిల్లాకు పాకినట్టే కనిపిస్తోంది. సీఎం జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి.. జగన్ సమావేశానికి రాకుండా ముఖం చాటేశారు. కేబినెట్లో ఛాన్స్ ఇస్తానన్న జగన్ రెడ్డి..2 సార్లు మాట తప్పటంతో…ఆర్కే ఆగ్రహంగా ఉన్నట్టు చెబుతున్నారు. దీనికితోడు.. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వటానికి జగన్ రెడ్డి విముఖత చూపించటంతో.. ఎమ్మెల్యే ఆర్కే తన దారి తాను చూసుకోవటానికి డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. దీంతో.. మంగళగిరి వైసీపీలోనూ అసమ్మతి జ్వాలలు రాజుకుంటున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో.. సీఎం జగన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరించే ఎమ్మెల్యేల సంఖ్య వైసీపీలో రోజు రోజుకూ పెరుగుతోంది. నెల్లూరు జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే వైసీపీ చేజారగా.. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి సైతం పార్టీకి గుడ్ బై చెబుతారనే ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితునిగా.. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గుర్తింపు పొందారు. అయితే.. సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఎమ్మెల్యేలతో నిర్వహించిన వర్క్ షాప్ కు ఆయన ముఖం చాటేయటం.. ఆళ్ల పార్టీ వీడతారనే ప్రచారానికి బలం చేకూరుస్తోంది. గత కొంత కాలంగా జగన్ రెడ్డికి దూరంగా ఉంటున్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి.. పార్టీ కార్యకలాపాల్లో సైతం అంటీ ముట్టనట్టుగానే ఉంటున్నారు. తన కుమారుడి వివాహానికి సైతం సీఎం జగన్ రెడ్డిని ఆహ్వానించలేదని చెబుతున్నారు. దీంతో వీరిద్దరి మధ్య గ్యాప్ ఎంత పెరిగిందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. ఇన్నాళ్లూ సరైన సమయం కోసం ఎదురు చూసిన ఆర్కే.. అదును చూసి తన అసమ్మతిని వ్యక్తం చేసినట్టు అంచనా వేస్తున్నారు.
వాస్తవానికి.. మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆర్కే 2014,2019లలో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో లోకేశ్పై గెలవటం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. నారా లోకేశ్ను ఓడిస్తే ఆళ్లకు తన కేబినెట్లో చోటు కల్పిస్తానని గతంలో ఎన్నికల ప్రచారంలో జగన్ హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. రెండో కేబినెట్లో అయినా తనకు చోటు దక్కుతుందని ఆళ్ల ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ సీఎం జగన్ రెడ్డి ఆళ్ళకు మొండిచేయి చూపారు. మరోవైపు ఆళ్ల రామకృష్ణారెడ్డికి బదులు మరొకరిని మంగళగిరి బరిలోకి దింపటానికి జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చేనేత సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవిని సీన్ లోకి తీసుకు వచ్చారు. ఆయనకు నామినేటెడ్ పోస్టు ఇవ్వటమే కాకుండా… మంగళగిరి పాలిటిక్స్లో యాక్టివ్ రోల్ ఇచ్చారు. లోకేశ్ను ఎదుర్కోవాలంటే అభ్యర్థి మార్పు తప్పదనే నిర్ణయానికి జగన్ రావడంతోనే.. ఆర్కే ప్రయార్టీ తగ్గించినట్టు ప్రచారం జరుగుతోంది.
వైసీపీ అధికారంలోకి రాకముందు నుంచీ ఆళ్ల రామకృష్ణా రెడ్డి జగన్ రెడ్డితో ట్రావెల్ అయ్యారు. జగన్ జైలుకు వెళ్ళిన సమయంలోనూ అనుబంధాన్ని వీడలేదు. జగన్ కోసం అమరావతి రైతులకు వ్యతిరేకంగా ఎన్నో కుట్రలు పన్నారు. అమరావతి ఉద్యమంపై విషం జల్లే కార్యక్రమానికి నేతృత్వం వహించారు. తీరా.. ఇన్ని చేసినా జగన్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వలేదు. పైగా టీడీపీ నుంచి వచ్చిన గంజి చిరంజీవిని ప్రోత్సహిస్తున్నారు. దీంతో వైసీపీలో ఉండటం వేస్టనే భావనకు ఆళ్ళ వచ్చినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన అసమ్మతిని తెలియచేయటానికి ఎమ్మెల్యేలతో సీఎం నిర్వహించిన సమావేశానికి గైర్హాజరైనట్టు చెబుతున్నారు. మొత్తం మీద.. మంగళగిరి వైసీపీలో మొదలైన ముసలం.. ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.