
బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్.. ఉచిత పథకాలతో ఓటర్లకు గాలం
- NewsPolitics
- May 2, 2023
- No Comment
- 32
ఉచితాలు వద్దంటూనే, కర్ణాటకలో బీజేపీ ఉచిత హామీల వర్షం కురిపించింది. ఉచిత పాలు, ఉచిత సిలిండర్లు లాంటి హామీలను మేనిఫెస్టోలో చేర్చి ఓటర్లకు గాలమేస్తోంది. రాష్ట్రంలో ఏ నందినీ పాల బ్రాండ్ వల్ల బీజేపీ విమర్శలు ఎదుర్కొందో, ఇప్పుడు అదే పాలను కాషాయపార్టీ మేనిఫెస్టోలో చేర్చడం విశేషం. గుజరాత్ అమూల్ పాలను తీసుకొచ్చి … కర్ణాటక బ్రాండ్ నందిని మిల్క్ డైరీని లేకుండా చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ.. విపక్షాలు ఎన్నికల అస్త్రంగా మల్చుకున్నాయి.
నందినీ డైరీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి. దాంతో, ఓటర్లకు రాంగ్ మెసేజ్ వెళ్తుందని గ్రహించిన కమలదళం… తాము అధికారంలోకి వస్తే పేదలకు ఇంటింటికీ హాఫ్ లీటర్ పాలు ఫ్రీ అందిస్తామంటోంది. అంతేకాదు, ఉచిత సిలిండర్లను అందిస్తామని పేర్కొంది. ప్రజా ప్రణాళిక పేరుతో బీజేపీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అందులో, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు ప్రతి రోజు ఉచితంగా అర లీటరు నందిని పాలు, పేద కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం, 5 కేజీల తృణధాన్యాలతో నెలవారీ రేషన్ కిట్ లాంటి హామీలు ప్రకటించింది. ఇక, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు ఏటా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల వాగ్దానం చేసింది.
మైసూరులోని ఫిల్మ్ సిటీకి దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్ పేరు పెట్టడంతో పాటు, ప్రతి వార్డులో అటల్ ఆహార కేంద్రాలు, నిరాశ్రయులకు 10 లక్షల ఇళ్ల స్థలాల కేటాయింపు, వృద్ధులకు ఉచితంగా వార్షిక హెల్త్ చెకప్లు లాంటి హామీల వర్షం కురిపించింది.