
ఏపీలో బీఆర్ఎస్ ఓపెనింగ్
- Ap political StoryNewsPolitics
- May 22, 2023
- No Comment
- 27
ఎట్టకేలకు ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభమైంది. అయితే, ప్రారంభోత్సవానికి తెలంగాణ నుంచి ఎవరూ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. సీఎం కేసీఆర్ గానీ, ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు, నేతలు ఎవరూ వెళ్లలేదు. పార్టీ ఆఫీసును తనకు తానే ప్రారంభించుకున్నారు ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్. గుంటూరు ఆటోనగర్ వద్ద ఏఎస్ కన్వెన్షన్ హాల్ వెనుక భాగంలోని ఐదంతస్తుల కొత్త భవనంలో పార్టీ కార్యలయాన్ని ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్ ఆవిర్భవించి దాదారు ఆర్నెళ్లు కావొస్తుంది. పార్టీ పెట్టిన కొత్తలోనే ఏపీలో పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ అంటూ హడావుడి చేశారు. భారీ బిల్డింగ్ చూడాలని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. కానీ, ముందడుగు పడలేదు. విశాఖలో భారీ బహిరంగ సభ ఉంటుందని ఊదరగొట్టారు. అది కూడా జరగలేదు. ఇక, విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెప్పి… ఉక్కు పరిశ్రమలో ఓ బిడ్ కు సంబంధించిన టెండర్ లో పాల్గొంటామని కూడా చెప్పారు. కానీ,అతీగతీ లేదు. విశాఖలోనే పార్టీ ఆఫీసు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ, అలాంటి ప్రయత్నాలేవీ జరగలేదు. చివరకు గుంటూరులో కొద్దిపాటి అనుచరుల సమక్షంలో బీఆర్ఎస్ ఆఫీసును రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేశారు తోట చంద్రశేఖర్.
జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన కేసీఆర్, వివిధ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే పలువురుని పార్టీలో చేర్చుకుంటున్నారు. మహారాష్ట్రలో భారీ బహిరంగసభలు కూడా నిర్వహించారు. అయితే, కేసీఆర్ ఎప్పుడో బయటకొచ్చినప్పుడే బీఆర్ఎస్ హడావుడి కనిపిస్తోంది. మళ్లీ, దాని ఊసే వినిపించడం లేదు. పక్కనే ఉన్న ఏపీలో పెద్దగా ఎవరూ బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవడం లేదు. ఈ క్రమంలోనే ఇంతకాలం పార్టీ ఆఫీసును కూడా తెరవలేకపోయారు గులాబీ బాస్ అధినేత. చేరికలు లేనప్పటికీ, గుంటూరులో సైలెంట్ గా ఓ బిల్డింగ్ లో రిబ్బన్ కట్ చేసి ఇదిగో తమ ఏపీ పార్టీ శాఖ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.