
ప్లాంట్ ప్రైవేటీకరణలో వెనుకడుగు వేయం: కేంద్రం
- Ap political StoryNewsPolitics
- April 17, 2023
- No Comment
- 37
వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించబోం.. అంటూ ఉక్కుశాఖ సహాయ మంత్రి ప్రకటించిన 24 గంటల్లోనే.. కేంద్ర ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. ఆరు నూరైనా.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ విషయంలో వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెప్పింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ లో వాటాల ఉపసంహరణ ప్రకియపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఉక్కుమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి కూడా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని..ఆ ప్రకటనలో కేంద్రం పేర్కొంది. అంతే కాదు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో డిజిన్విస్టె మెంట్ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీంతో.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా ఆపిన ఘనత తమదే అంటూ…. ప్రకటనలు చేసిన నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టైంది.
ఇప్పటికిప్పుడు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేయాలని కేంద్రం అనుకోవటం లేదని కేంద్ర మంత్రి ఫగ్గన్ గురువారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఫగ్గన్ అలా మట్లాడారో లేదో.. మీడియాలో ఆయన ప్రకటన వైరల్ అయిపోయింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం వెనుకడుగు వేసిందంటూ వార్తలు సర్క్యులేట్ అయ్యాయి. ఇదంతా తమ ఘనత అంటే తమ ఘనత అంటూ ప్రధాన రాజకీయ పార్టీలు గొప్పలు పోయాయి. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు దగ్గర నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ వరకు.. ఈ క్రెడిట్ అంతా తమదే అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ .. తాము విశాఖలో విజయోత్సవాలు ఏర్పాటు చేశామని ప్రకటించేశారు. అయితే.. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ లో వాటాల ఉపసంహరణ ప్రకియపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని.. ఆపడానికి కూడా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని.. కేంద్రం స్పష్టం చేసింది. దీంతో సదరు రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు డిఫెన్స్లో పడ్డాయి.
మొత్తం మీద.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనుకడుగు వేసేది లేదని కేంద్రం తేల్చి చెప్పటంతో.. బంతి మళ్ళీ ప్రతిపక్ష పార్టీల కోర్టులోకి వచ్చి పడింది. దీంతో ఏపీలోని ప్రధాన పార్టీలో పాటు.. బీఆర్ఎస్ పార్టీ ఎలా రియాక్టవుతుందో వేచి చూడాలి.