
టీడీపీ ఆవిర్భావసభలో చంద్రబాబు సమర నినాదం
- Ap political StoryNewsPolitics
- March 30, 2023
- No Comment
- 33
తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా.. వారి సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పని చేస్తుందని.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పని చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగిన టీడీపీ 41వ ఆవిర్భావ వేడుకల్లో.. ప్రతినిధులను ఉద్దేశించి బాబు ప్రసంగించారు. తెలుగు ప్రజల కోసం పార్టీని స్థాపించి.. పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన స్వర్గీయ ఎన్టీఆర్ కు ఆయన ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. నేటికీ పేదల ఆకలి తీరుస్తోన్న కిలో రెండు రూపాయల బియ్యం పథకం నుంచి పటేల్ పట్వారీ వ్యవస్థల రద్దు, స్థానిక సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రారంభం వరకు ఎన్టీఆర్… తెలుగు ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు తలెత్తుకుని గౌరవంగా తిరుగుతున్నారంటే… దాని వెనుక ఆ మహానుభావుని కృషి దాగి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. అటువంటి మహనీయుని శత జయంతి వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా రంగ రంగ వైభవంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా 100 రూపాయాల వెండి నాణెం విడుదల చేసిన ప్రధాని మంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
ఇక.. 1990వ దశకంలో భారతదేశంలో సంస్కరణలకు బీజం వేసిన వ్యక్తి పీవీ నర్సింహరావు అయితే.. ఆ సంస్కరణలను కొనసాగించిన ఘనత తెలుగుదేశానికే దక్కుతుందని చంద్రబాబు తెలిపారు. ఆనాడు ఇంటర్నెట్, సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను గమనించి.. హైదరాబాద్ను ఐటీ హబ్ గా తీర్చి దిద్దామని ఆయన పేర్కొన్నారు. విజన్ 2020 లక్ష్యంగా మొదలు పెట్టిన ప్రస్థానం.. ఈనాడు లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు తీసుకు వస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేయటం ద్వారా మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలను ఆకర్షించగలిగామన్నారు. ఇవాళ హైటెక్ సిటీ ఎంతగా అభివృద్ధి చెందిందో.. లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందో.. తెలుగు ప్రజలు గుర్తించారని బాబు అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, నాలెడ్జ్ ఎకానమీ సృష్టించటం ద్వారా మాత్రమే యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతామని.. దీనికై రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళుతుందని ఆయన పేర్కొన్నారు. ఓట్ల కోసం.. రాజకీయ స్వార్ధం కోసం కాకుండా కేవలం తెలుగు ప్రజల భవిష్యత్ కోసం మాత్రమే తన విజన్ ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
తెలుగు వారి అభ్యున్నతి కోసం ఆనాడు తాను హైటెక్ సిటీ, ఇంటర్నెషనల్ ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, ఐఎస్బీ, జీనోమ్ వ్యాలీ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణాలను చేపట్టానని బాబు తెలిపారు. అయితే ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు వాటి పురోగతిని అడ్డుకుని ఉంటే… తెలుగు ప్రజలకు అభివృద్ధి ఫలాలు అంది ఉండేవా..? అని ఆయన ప్రశ్నించారు. తన తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు.. తాను మొదలు పెట్టిన వాటిని కొనసాగించటం వల్లే.. హైదరాబాద్లో ఈ స్థాయి అభివృద్ధి సాధ్యమైందన్నారు. తన ఆలోచన అంతా ప్రజలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని.. పేదల జీవితాలను మార్చాలనే ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇక.. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి ప్రపంచానికే రోల్ మోడల్గా నిలిచిందన్న చంద్రబాబు.. ఏపీలో జగన్ రెడ్డి సాగిస్తున్న విధ్వంసకర పాలనపై నిప్పులు చెరిగారు. ఏపీ ముఖ్యమంత్రి ఓ సైకో మాదిరిగా వ్యవహరిస్తున్నారన్న చంద్రబాబు.. తనకు పేరు వస్తుందన్న కారణంతో అమరావతిని ఆపేసి మూడు ముక్కలాట ఆడుతున్నారన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ఆపేసి.. పరిశ్రమలను తరిమేసి.. ఓ రకమైన అరాచక పాలన సాగిస్తున్నారని మండి పడ్డారు. ఎన్ని కష్టాలు ఎదురైనా.. తెలుగు ప్రజల అభ్యున్నతికే తాను పాటు పడతానని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం చూసైనా జగన్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. ఏపీలో తెలుగుదేశం గెలుపు చారిత్రక అవసరం అని స్పష్టం చేసిన చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్లో జైత్ర యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇక… నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభమయిన ఈ సభకు తెలుగు రాష్ట్రాల నుంచి 15 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరుకావడం గమనార్హం. సభను విజయవంతం చేసేందుకుగాను పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. వేదిక వద్ద ఎల్ఈడీ తెరలు, నగరమంతటా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. చంద్రబాబు మధ్యాహ్నం 3 గంటలకు తన ఇంటి నుంచి బయలుదేరి ఎన్టీఆర్ ఘాట్కు వెళ్లి నివాళులర్పించారు. 4 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్కు చేరుకున్నారు. 41వ ఆవిర్భావ వేడుక సందర్భంగా కేక్ కట్ చేశారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్కు కేక్ తినిపించారు. అమరులైన కార్యకర్తలకు చంద్రబాబు నివాళులర్పించారు.