
అద్దె ఇంటిని జప్తు చేయడమేంటి జగన్ రెడ్డీ?
- Ap political StoryNewsPolitics
- May 15, 2023
- No Comment
- 34
ఏపీలో మరో జగన్నాటకం మొదలైంది. అకాల వర్షాలతో రోడ్డున పడ్డ రైతులను ఆదుకోవడం చేతగాని ప్రభుత్వం మరో రాజకీయ కుట్రకు తెరలేపింది. రైతుల తరపున టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పోరుబాట పట్టారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ…వారికి తోడు నీడగా నిలుస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. దాంతో, అది జీర్ణించుకోలేని జగన్ రెడ్డి, చంద్రబాబు అద్దెకున్న ఇంటిమీద పడి ఏడుస్తున్నారు. సీబీఎన్ నివాసాన్ని జప్తు చేయాలంటూ సీఐడీకి అనుమతిస్తూ జగన్ ప్రభుత్వం చిల్లర రాజకీయం మొదలుపెట్టింది.
ఏపీలో జగన్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. జగన్ సర్కార్ రాజకీయ వేధింపుల పర్వం పరాకాష్టకు చేరుకుంది. రైతుల పోరాటం, వివేకా హత్య కేసు నుంచి ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు జగన్ సర్కార్ మరో కుట్రకు తెరలేపింది. అకాల వర్షాలతో పంటలు కోల్పోయిన రైతులను ఆదుకోవాలంటూ చంద్రబాబు పోరాడుతున్నారు. ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. అయినా జగన్ రెడ్డిలో చలనం లేదు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడం మానేసి, బాబుపై ప్రతీకారంతో రగిలిపోతున్నారు.
ఈ క్రమంలోనే అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు అద్దెకు ఉంటున్న ఇంటిని అటాచ్ చేయాలంటూ సీఐడీకి ఆదేశాలు ఇచ్చారు. అద్దె ఇంటిని జప్తు చేయమంటూ జగన్ సర్కార్ జారీ చేసిన ఆదేశాలను చూసి జనం నవ్వుకుంటున్నారు.
నాడు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు దోచుకున్న జగన్ రెడ్డి… ఈడీ, సీబీఐ కేసులు ఎదుర్కొంటున్నారు. జైలుకు కూడా వెళ్లివచ్చారు. నేడు తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని విచారణల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ప్యాలెస్ లున్న జగన్ రెడ్డికి…అన్ని వేల కోట్లు ఎలా ఎక్కడి నుంచి వచ్చాయి.
దేశంలోనే అత్యధిక ధనవంతుడైన ముఖ్యమంత్రిగా వేల కోట్ల ఆస్తులు పోగేసుకున్న ఘనుడు కూడా జగన్ రెడ్డినే. అలాంటి జగన్ రెడ్డి, ఓ ఫైక్ కంప్లైంట్ ను పట్టుకొని చంద్రబాబు అద్దె ఇంటిని అటాచ్ చేయాలనే… అవివేకపు, మూర్ఖత్వపు పోకడలకు పోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కరకట్ట రోడ్డుపై లింగమనేని రమేష్కు చెందిన ఇంట్లో కొన్నేళ్లుగా చంద్రబాబు అద్దెకు ఉంటున్నారు. అయితే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ బేసిస్.. క్విడ్ ప్రోకో అంటూ జగన్ రకరకాల విన్యాసాలు మొదలు పెట్టారు. మరోవైపు, మాజీ మంత్రి పి.నారాయణ.. బినామీల పేరిట కొన్న ఆస్తులుగా పేర్కొంటూ మరికొన్నింటిని జప్తు చేసేందుకూ సీఐడీకి జగన్ రెడ్డి సర్కార్ అనుమతి జారీచేసింది. ఈ మేరకు విజయవాడలోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసేందుకు సీఐడీ దర్యాప్తు అధికారికి అనుమతులిచ్చింది.
సీఆర్డీఏ మాస్టర్ప్లాన్, ఇన్నర్ రింగ్రోడ్డు విషయాల్లో పలు అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగం మోపారు. అయితే, చంద్రబాబు అద్దె ఇంట్లో ఉండడమే పాపం అన్నట్టుగా నోటీసులు ఇవ్వడం, లేని ఇన్నర్ రింగ్ రోడ్డులో ఏదో జరిగిపోయిందని ఆరోపణలు చేయడం…జగన్ రాజకీయ వేధింపుల్లో భాగంగా జరుగుతున్న జగన్నాటకమని తేలిపోయింది.
జగన్ జారీ చేసిన అటాచ్మెంట్లు.. జీవోలు.. నాలిక గీసుకోవడానికి కూడా పనికి రావని నిపుణులు చెబుతున్నారు. గతంలోనూ జగన్ రెడ్డి తీసుకొచ్చిన బ్రిటీష్ కాలం నాటి జీవో 1ను హైకోర్టు కొట్టివేసింది. అయినా కూడా నిబంధనలకు విరుద్ధమని తెలిసీ, మళ్లీ జీవో 89, 90 తీసుకొచ్చి చంద్రబాబు, నారాయణపై పై దుష్ర్పచారం మొదలుపెట్టారు జగన్ రెడ్డి. కోర్టులో కొట్టేసిన అంశాలతో… మళ్లీ కొత్త చట్టాలతో తప్పుడు కేసులు పెడుతున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, పాతకాలం నాటి చట్టాలతో జగన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
చం ద్రబాబు నివాసం ఉంటున్న భవనాన్ని ఆయన పేరుతో రిజిస్టర్ చేయలేదని జీవోలో పేర్కొన్నారు. ఆ గెస్ట్హౌస్కు యజమాని లింగమనేని అయినప్పుడు..అందులో చంద్రబాబు క్విడ్ప్రోకో ఎలా ఉంటుంది? చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటికి ఎటాచ్మెంట్ ఆర్డర్ ఇవ్వడం… వైసీపీ సైకో చర్యలకు నిదర్శనమంటూ టీడీపీ నేతలు జగన్ రెడ్డిపై మండిపడుతున్నారు .
ఇప్పటికే పక్క రాష్ట్రంలో జగన్ ఆస్తులు డోలాయమానంలో పడ్డాయి. మరోవైపు, వివేకా హత్య కేసులో రేపో మాపో అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడని అంటున్నారు. మరోవైపు, అమరావతి రైతులు చేస్తున్న పోరాటానికి జగన్ రెడ్డి భయపడిపోతున్నారు. ఇంకోవైపు, టీడీపీ, జనసేన మధ్య వచ్చే ఎన్నికల్లో పొత్తు పక్కాగా ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దాంతో, ప్రస్టేషన్ లోకి వెళ్లిపోయిన జగన్ తప్పుల మీద తప్పులు చేస్తూ, జగన్ తన రాజకీయ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అటాచ్ మెంట్ పేరుతో డ్రామాలాడుతున్న జగన్ రెడ్డి జిమ్మిక్కులను జనం ఎవరూ నమ్మడం లేదు.