
కర్ణాటక దెబ్బతో రూట్ మార్చిన కేసీఆర్
- NewsPoliticsTelangana Politics
- May 16, 2023
- No Comment
- 26
కర్ణాటకలో ఎన్నికల దెబ్బ తెలంగాణపై గట్టిగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు జాతీయ రాజకీయాల పేరుతో హడావుడి చేసిన కేసీఆర్…ఇకపై పూర్తిగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై పూర్తిగా దృష్టిసారించనున్నారని తెలుస్తోంది. నేల విడిచి సాము చేయడం అంత మంచిది కాదని గులాబీ దళపతి భావిస్తున్నారట. అందుకే, కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో కేసీఆర్ వ్యూహాలు మార్చుకోనున్నారని తెలుస్తోంది. కొన్నాళ్లు జాతీయ దుకాణం సర్దేసి, రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడంపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నారట.
మరో ఆర్నెళ్లలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర ప్రజావ్యతిరేకత కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో రాష్ట్రాన్ని వదిలి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే మొదటికి మొసం వస్తుందని కేసీఆర్ గ్రహించారట. కేసీఆర్ చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లో ఉండాలని ఆదేశించారు. ఏమాత్రం తోక జాడించినా టిక్కెట్ ఉండదని కూడా తేల్చేశారు.
ఈక్రమంలోనే కర్ణాటక రిజల్ట్స్ నేపథ్యంలో, మరోసారి ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం నిర్వహించే బీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఈ భేటీలో అసెంబ్లీ ఎన్నికలపై కీలకంగా చర్చిస్తారని తెలుస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ కుమ్ములాటలతో సతమతమవుతోంది. ఇక, బీజేపీకి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేంత బలం, బలగం లేదు. ఆ పార్టీకి సగం నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేని పరిస్థితి. అందుకే, కాంగ్రెస్, బీజేపీలను లైట్ తీసుకున్న కేసీఆర్…జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే, కర్ణాటక ఎన్నికల దెబ్బతో కేసీఆర్ అంచనాలన్నీ పటా పంచలు అయ్యాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేలచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్, బీజేపీల ఫోకస్ అంతా ఇప్పుడు తెలంగాణపైనే ఉంది. అందుకే, అసెంబ్లీ ఎన్నికలను అంత ఆశామాషీగా తీసుకోవద్దని భావించిన కేసీఆర్, పార్టీ ప్రజాప్రతినిథులతో ఎమర్జెన్సీ మీటింగ్ ను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నా కర్ణాటకలో బీజేపీ చిత్తయిపోయింది. ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ అఖండ విజయాన్ని సాధించింది. రానున్న రోజుల్లో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశాలున్నాయి. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటోన్న కేసీఆర్…ప్రత్యర్థుల ఎత్తులను ధీటుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ దిశగానే గులాబీదళపతి వ్యూహాలు సిద్ధం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే ఆ తర్వాత ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని కర్ణాటక ఎన్నికలతో కేసీఆర్ గ్రహించినట్టున్నారు. అందుకే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో విజయంపైనే తన శక్తియుక్తులన్నీ ప్రదర్శించాలని డిసైడ్ అయ్యారట.