
తెలంగాణలో పంట నష్టానికి పరిహారం.. ఏపీలో రైతులను కనికరించని జగన్ రెడ్డి ..
- Ap political StoryNewsPoliticsTelangana Politics
- May 8, 2023
- No Comment
- 35
అకాల వర్షాలతో ఆగమైపోయిన అన్నదాతలను ఆదుకునేందుకు తెలంగాణ సర్కార్ ముందుకొచ్చింది. పంటనష్టపోయిన రైతులకు పరిహారం కూడా ప్రకటించింది. కానీ, పక్కనే ఉన్న ఏపీ ప్రభుత్వంలో ఇప్పటివరకు కదలిక లేదు. రైతులు పంటలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో రోడ్డున పడినా, జగన్ సర్కార్ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు…మే 12 నుంచి పరిహారం పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే సదుద్దేశంతో.. ఎకరాకు పది వేల పరిహారం ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో రైతులను పరామర్శించిన సమయంలోనే.. అక్కడే పరిహారం కూడా ప్రకటించారు కేసీఆర్. పంటతో సంబంధం లేకుండా.. ఎకరాకు 10 వేల చొప్పున బాధిత రైతులందరికీ పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా.. ఈ పరిహారం కౌలు రైతులకు కూడా అందేలా మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.దాంతో, వడగండ్ల వానల వల్ల నష్టపోయిన బాధిత రైతులను అధికారులు గుర్తించారు.
ఈ మేరకు ముఖ్యమంత్రికి నివేదికలు సమర్పించడంతో…పరిహారం పంపిణీ చేయాల్సిన తేదీని ప్రభుత్వం ప్రకటించింది. కొత్త సచివాలయ ప్రారంభం రోజే.. అకాల వర్షాల పరిహారానికి సంబంధించిన ఫైల్ మీద కేసీఆర్ సంతకం చేశారు.
ఏపీలోనూ అకాలవర్షాలు అన్నదాతను అతలాకుతలం చేశాయి. అయితే, ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దయిపోయినా, ముఖ్యమంత్రి, సంబంధింత వ్యవసాయ మంత్రి అటువైపు కన్నెత్తికూడా చూడడం లేదు. కనీసం గోనె సంచులు కూడా ఇవ్వలేని దారుణ పరిస్థితులు ఏపీలో ఉన్నాయి. అకాల వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్లో సుమారు 75కు పైగా నియోజకవర్గాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, మిరప, పసుపు తదితర వాణిజ్య పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి దారుణంగా ఉంది.
జగన్ సర్కార్ ధాన్యం సరిగా కొనుగోలు చేయకపోవడంతో…కల్లాలు, చేలల్లోనే తడిసి మొలకెత్తిపోయింది. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో రైతన్న కన్నీరు పెడుతున్నాడు. మరోవైపు.. ఉన్న కొద్దో గొప్పో అమ్ముకుందామన్న ఆశలు కూడా అడియాశలవుతున్నాయి. రైస్ మిల్లర్లు రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇంత జరిగినా కనీసం అధికారులు గానీ, పాలకులు గానీ రైతులను పట్టించుకున్న పాపాన పోవడం లేదు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటిస్తూ అన్నదాతల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. భారీ వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన పంటలను స్వయంగా పరిశీలిస్తున్నారు. రైతులు పంటలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. తాడేపల్లి ప్యాలెస్లో జగన్ ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. బాధిత రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నష్ట పరిహారం అందించేంత వరకు పోరాడుతామని సీబీఎన్ స్పష్టం చేశారు.
పొరుగునే ఉన్న తెలంగాణ ప్రభుత్వం రైతులను వేగంగా ఆదుకునే చర్యలు చేపడుతున్నా…జగన్ సర్కార్ కు మాత్రం అవేమీ కనిపించడం లేదు. రైతులను ఆదుకోవాలన్న ఆలోచనే లేకుండా పోయింది. కర్షకులకు అండగా చంద్రబాబు రంగంలోకి దిగడంతో.. ఆయన పర్యటిస్తున్న ప్రాంతాల్లో హడావుడిగా ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటోంది. కానీ, మొక్కుబడిగా ధాన్యం కొనుగోలు చేయటమే తప్ప… పంట నష్టపరిహారం, ఇన్ పుట్ సబ్సిడీ మీద నేటికీ జగన్ సర్కార్ స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో, 72 గంటల్లోగా ప్రభుత్వం దిగిరాకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు టీడీపీ అధినేత.