
పవన్ శపథం..గోదావరిలో వైసీపీ నిమజ్జనమేనా?
- Ap political StoryNewsPolitics
- July 1, 2023
- No Comment
- 19
గోదావరి జిల్లాల్లో రాజకీయం వేడెక్కుతోంది. గత ఎన్నికల్లో గంపగుత్తగా వైసీపీకి ఓట్లు రాల్చిన గోదావరి ప్రజానీకం, ఈసారి ఆ పార్టీకి ఊహించని షాక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది . పవన్ వారాహి గోదావరి జిల్లాల్లోకి ఎంట్రీ ఇచ్చాక, రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తులో జగన్ పార్టీ కొట్టుకుపోవడం ఖాయమనే విశ్లేషణలు సాగుతున్నాయి.వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కనివ్వనంటూ, జనసేనాని చేస్తున్న రాజకీయంతో వైసీపీ బెంబేలెత్తిపోతోంది. నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచిన జగన్ ను, గోదావరి జిల్లాల్లో అడ్రస్ లేకుండా చేస్తామంటూ పవన్ శపథం చేస్తున్నారు. జగన్ ఎంతమంది ముద్రగడలను తీసుకొచ్చినా.. బాహుబలి లాంటి బాబు, పవన్ ల దెబ్బకు చిత్తుకాక తప్పదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఏపీ రాజకీయాల్లో గోదావరి జిల్లాలది ప్రత్యేక స్థానం. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు కీలక భూమిక పోషిస్తుంటాయి. గోదావరి జిల్లాల ప్రజలు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటారు. అందుకే, అక్కడి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ పోటీ పడుతుంటాయి. వారి మనసు గెలుచుకుంటే, అధికారం దక్కినట్టేనన్న ధీమాతో వ్యూహప్రతివ్యూహాలు రచిస్తుంటారు. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ ఏర్పాటులో కీ రోల్ పోషించిన ఆ జిల్లాల ఓటర్లు… ఈసారి టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ స్ధానాలు ఉన్నాయి. వీటిలో తూర్పు గోదావరి జిల్లాలో 19, పశ్చిమ గోదావరి జిల్లాలో మరో 15 ఉన్నాయి. ఏపీలోని మొత్తం 175 స్థానాల్లో చూస్తే.. ఉమ్మడి గోదావరి జిల్లాల అసెంబ్లీ స్థానాల సంఖ్య దాదాపు 20 శాతం ఉంటుంది. 2019 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలోని 19 స్థానాల్లో… వైపీపీ 14 స్థానాల్లో విజయం సాధిస్తే.. టీడీపీకి నాలుగు, జనసేనకు ఒక స్థానం లభించింది. ఆ జనసేన ఎమ్మెల్యే కూడా వైసీపీ గూటికి చేరిపోయారు. ఇక, పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 స్థానాలకు వైసీపీకి 13 స్థానాల్లో విజయం సాధిస్తే.. టీడీపీ 2 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. కానీ, ఈసారి అక్కడ లెక్కలు మారిపోతున్నాయి.
గోదావరి జిల్లాల్లో పవన్ చేపట్టిన వారాహి యాత్ర సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. తూర్పు, పశ్చిమలో కాపు ఓటు బ్యాంక్ అధికంగా ఉంటుంది. ఈసారి వారంతా జనసేనకు మద్దతుగా నిలవాలనే ఏకాభిప్రాయానికి వచ్చేశారు. కాపులతో పాటు దళితులు, బీసీలు, మైనార్టీలు ఇలా అన్ని వర్గాలు టీడీపీతో పాటు జనసేన వైపు ఆకర్షితులవుతున్నారు. దీంతో, వైసీపీ కంగారుపడిపోతుంది. గోదావరోళ్ల ఓటు బ్యాంకు తమకు వ్యతిరేకంగా మారితే, డిపాజిట్లు గల్లంతైపోతాయనే భయంతో…. కులాల మధ్య కుంపట్లు రాజేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు జగన్. అది కూడా బెడిసి కొడుతోంది. పవన్ పైకి ముద్రగడ లాంటి వారిని ఉసిగొల్పినా, రివర్స్ అటాక్ అవుతోంది. కాపులంతా జగన్ ప్రయత్నాలను తిప్పికొడుతున్నారు.
ఇప్పటికే ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన జగన్ కు ఈసారి ఘోర పరాభవం తప్పదని పలు సర్వేలు కుండబద్దలు కొడుతున్నాయి. టీడీపీ, జనసేన కలిస్తే… ఉభయ గోదావరి జిల్లాలు వైసీపీ రహిత జిల్లాలుగా మారిపోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.