
కాంగోలో జలప్రళయం..వందలాది మంది మృతి
- News
- May 8, 2023
- No Comment
- 34
ఆఫ్రికా దేశమైన డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వరదలు బీభత్సం సృష్టించాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా…. దక్షిణ ప్రావిన్స్లోని కలేహలో నదులు వరదలతో పోటెత్తాయి. దీంతో ఊర్లకు ఊర్లే కొట్టుకుపోయాయి. బుషుషు, న్యాముకుబి వంటి గ్రామాలను వరద ముంచెత్తింది. మరోవైపు, వరదల ధాటికి కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 200 మందికిపైగా మృతి చెందారు.
మరికొంతమంది గల్లంతయ్యారు. గల్లంతయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అధికారులు దాదాపు 203 మృతదేహాలను గుర్తించారు.భారీ వర్షాల కారణంగా ఆయా ప్రాంతాల్లోని నదులు పొంగిపొర్లడంతో అనేక గ్రామాలు మునిగిపోయాయని, చాలా ఇళ్లు కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు.
గత నెలలో కురిసిన వానలకు కొండచరియలు విరిగిపడి 21 మంది చనిపోయారు. కిన్షాసాలో డిసెంబర్లో కురిసిన భారీ వర్షాలతో 169 మంది మృతిచెందారు. కాగా, 2014లో కూడా కాంగో ఇంతే స్థాయిలో ప్రకృతి విపత్తుని ఎదర్కొన్నట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. నాటి విధ్వంసంలో సుమారు 130 మందికి పైగా ప్రజలు గల్లంతయ్యినట్లు యూఎన్ పేర్కొంది.
గ్లోబల్ వార్మింగ్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోని దేశాలకు ఇదోక వినాశకరమైన ఉదాహరణ అని హెచ్చరించింది. వేగవంతమైన వాతావరణ మార్పులకు ఇదొక మచ్చుతునక అని స్పష్టం చేసింది.