
తెలంగాణలో బస్తీమే సవాల్ అంటున్న రేవంత్, ఈటల..
- NewsPoliticsTelangana Politics
- April 22, 2023
- No Comment
- 38
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య మునుగోడు మంట మండుతోంది. అధికార బీఆర్ఎస్ వర్సెస్ విపక్షాలుగా సాగిన వార్ ఇప్పుడు యూ టర్న్ తీసుకొని…కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా… బీఆర్ఎస్ పార్టీ , కాంగ్రెస్ 25 కోట్ల రూపాయలు ఇచ్చిందంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ కాక రేపుతున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు ఈటల వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు. దమ్ముంటే నిరూపించాలని సవాళ్లు విసురుతున్నారు. ఈటల రాజేందర్ వ్యాఖ్యలను తీవ్రంగా స్పందిస్తున్నామన్న రేవంత్ రెడ్డి…. భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద తడి బట్టలతో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని, అందుకు ఈటల సిద్ధమా అని సవాల్ విసిరారు. అయితే, కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేసిన ఈటల, రేవంత్ చాలెంజ్ ను లైట్ గా తీసుకున్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ టార్గెట్ గా బీజేపీ చేస్తున్న రాజకీయంతో తెలంగాణ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య పొత్తు ఉంటుందన్న సంకేతాలతో..ఆ రెండు పార్టీలు ఒక్కటేనంటూ బీజేపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే కొంతకాలంగా కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఈటల రాజేందర్. పొరపాటున కూడా ఎవరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే, సీఎం అయ్యేది మాత్రం కేసీఆర్ అని వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ కు మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు.
బీజేపీలో చేరికలు లేకపోవడంతో, ఈటల ప్రస్టేషన్ తో ఏవేవో మాట్లాడుతున్నారంటూ… కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. రేవంత్, ఈటల మధ్య జరుగుతున్న వార్పై బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ వేదికగా స్పందించారు. బీఆర్ఎస్తో పోరాడే తమ్ముళ్లు…తమ దాడిని ఒకరిపై ఒకరు చేసుకోవడం సరికాదని హితవు పలికారు. ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడటం అవసరమేమో అనిపిస్తుందని సూచించారు.ఇక, హుజూరాబాద్ లో ఈటలకు యాంటీగా ఉన్న కౌశిక్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హుజురాబాద్ ఉపఎన్నికలో రేవంత్ రెడ్డికి ఈటల 25 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. బీజేపీలో ఈటలకు సరైన ప్రాధాన్యత దక్కకపోవడంతో అసహనంతో మాట్లాడుతున్నారని అన్నారు.
మొత్తంగా, ఎప్పుడో ముగిసిన మునుగోడు ముచ్చటను ఈటల ఇప్పుడు తెరమీదకు తేవడం…అది కూడా కాంగ్రెస్ పై బట్ట కాల్చి మీద వేయడం ఎన్నికల స్ట్రాటజీలో భాగమేనా లేక నిజంగానే జరిగిందా ? అనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీపై పోరాటం చేయాల్సిన విపక్ష నేతలు, తమలో తామే తన్నుకోవడం తగదని పలువురు నేతలు హెచ్చరిస్తున్నారు.