
శ్రీవారి లడ్డూకు అంత చరిత్ర ఉందా..?
- News
- March 25, 2023
- No Comment
- 44
తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో ప్రధానమైనది లడ్డూ.. . తిరుపతి లడ్డూకు ఉన్న ప్రాముఖ్యత దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే దీని రుచి, సువాసన.. ప్రపంచంలో ఏ లడ్డూకు ఉండదు. అందుకే ఈ లడ్డూకు భౌగోళిక ఉత్పత్తి లైసెన్సు లభించింది. అంటే దీని తయారీ విధానాన్ని ఎవరూ అనుకరించకూడదు అని అర్ధం. భక్తులు భక్తిశ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే తొలిస్థానం. తిరుమల ఆలయంలో ప్రసాదంలో 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది తొలినాళ్ళ వరకూ ఇప్పుడు తిరుపతి లడ్డూ కి ఉన్న స్థానం వడకు ఉండేది. అప్పట్లో శ్రీవారికి నైవేద్యవేళలు ఖరారు చేశారు. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. తిరుమల కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. ఈస్టిండియా కంపెనీ ఆధ్వర్యంలో మహంతులు తిరుమల ఆలయ నిర్వహణ చూసే రోజుల్లో 19వ శతాబ్ది మధ్యభాగంలో తీపి బూందీ ప్రవేశపెట్టారు. 1940ల నాటికి అదే లడ్డూగా మారింది. క్రమేపీ వడ స్థానాన్ని లడ్డూ సంపాదించుకుంది, ఇప్పుడు శ్రీవారి ప్రసాదంగా .. లడ్డూకు భక్తుల నుంచి చాలా డిమాండ్ ఉంది.
లడ్డూ తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తారు. ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగ పిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలుకలు, జీడీపప్పు, కర్పూరం మొదలైన పదార్ధాలు ఉపయోగిస్తారు.ఒకప్పుడు బియ్యప్పిండితో చేసిన లడ్డూ ప్రసాదాన్నే తిరుమలకు వచ్చిన భక్తులకు శ్రీవారి ప్రసాదంగా అందించేవారట. బియ్యప్పిండి, బెల్లం కలిపి కట్టిన ఈ లడ్డూలను మనోహరాలని పిలిచేవారు. కర్ణాటక మెల్కోటే దేవాలయంలో మనోహరం ప్రసాదాన్నే పెడతారు. మధుర మీనాక్షి దేవాలయంలో బియ్యప్పిండి, మిన్నప్పిండి, పెసరపిండి కలిపి, లావు కారప్పూస వండి దాన్ని చిన్న ముక్కలుగా విరిచి బెల్లం పాకంలోవేసి, ఉండ కట్టి నైవేద్యం పెడతారు. దీన్ని మనోహరం అంటారు. మన మిఠాయి లడ్డూ ఇలాంటిదే! మనోహరాల గురించి హంసవింశతి కావ్యంలో కూడా ప్రస్తావన ఉంది. అంటే మూడువందల యాభయ్యేళ్ళ క్రితంవరకూ మనోహరం ఒక ప్రసిధ్ధమైన తీపి వంటకం
తిరుమల ఆలయంలో మూలమూర్తి కొలువు తీరి ఉండే గర్భాలయానికి శ్రీవారిపోటు అంటే వంటశాలకు ముందు వకుళమాత విగ్రహం నెలకొల్పారు. వాస్తు ప్రకారం ఆగ్నేయంగా ఆలయంలో నిర్మించినచోట పోటు ప్రసాదాలు తయారుచేస్తారు. తయారైన ప్రసాదాలను శ్రీనివాసుని తల్లి వకుళమాత విగ్రహం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ ఆమె ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. లడ్డు, వడలు మొదలైన పనియారాలు ఆలయంలో సంపంగి ప్రాకారం ఉత్తరభాగాన తయారుచేస్తారు. వాటిని కూడా తల్లికి చూపించాకే స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రీవారి ఆలయంలో లడ్డూల తయారీకి వాడవలసిన సరుకుల మోతాదును దిట్టం అంటారు. దీనిని తొలిసారిగా టీటీడీ పాలక మండలి 1950 లో నిర్ణయించింది. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు. దీనినే పడితరం దిట్టం స్కేలు అని పిలుస్తున్నారు. పడి అంటే 51 వస్తువులు. పడికి కావలసిన వస్తువుల దిట్టం ఉంటుంది. ఆ ప్రకారం ఉగ్రాణం శ్రీవారి స్టోర్ నుంచి వస్తువులు ఇస్తారు. దీని ప్రకారం 5100 లడ్డూలు మాత్రమే తయారుచేయడానికి ఇన్నేసి కిలోల ప్రకారం దిట్టాన్ని అనుసరిస్తారు.
1940 ప్రాంతంలో కళ్యాణోత్సవాలు మొదలైనప్పుడు.. ఇపుడు చూసే లడ్డూ తయారి మొదలైంది. దీన్ని తయారుచేయడానికి ప్రత్యెక పద్ధతి అంటూ ఒకటి ఉంది.లడ్డూ తయారు చేయడానికి వాడే సరుకుల మొత్తాన్ని దిట్టం అని పిలుస్తారు.ఈ దిట్టం స్కేలును 1950లో మొదట రూపొందించగా భక్తుల తాకిడిని బట్టి దీనిని 2001లో సవరించారు.ఇపుడు ఈ స్కేలు ప్రకారమే లడ్డూలను తయారు చేస్తున్నారు. శ్రీవారి లడ్డూ తయారిలో వాడే దిట్టంలో వాడే సరుకులు దీని ప్రకారం 5100 లడ్డూల తయారీకి 803 కేజీల సరుకులు వినియోగిస్తారు. ఆవు నెయ్యి – 165 కిలోలు, శెనగపిండి – 180 కిలోలు, చక్కెర – 400 కిలోలు, యాలుకలు – 4 కిలోలు, ఎండు ద్రాక్ష 16 కిలోలు, కలకండ 8 కిలోలు, ముంతమామిడి పప్పు 30 కిలోలను లడ్డూ తయారీలో వినియోగిస్తారు. ఈ మిశ్రమంలో సుమారు 5,100 లడ్డూలు వరకూ తయారవుతాయి.శ్రీవారి ఆలయం ఆగ్నేయదిక్కులో ఉన్న వంటశాలలో సుమారు 15000 వరకూ లడ్డూలు తయారవుతాయి. తొలి రోజుల్లో లడ్డూలను కట్టెలపొయ్యి మీద తయారుచేసేవారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని యంత్రాలను ప్రవేశపెట్టారు. తిరుమలలో లడ్డూ తయారీ కోసం పోటు అనే వంటశాల ఉంది. ఇక్కడ అత్యాధునికమైన వంట సామగ్రి సహాయంతో రోజూ లక్షల లడ్లు తయారీ జరుగుతోంది.
ప్రపంచంలో ఏ ఆలయానికి వెళ్లినా.. ఎక్కడికి వెళ్లినా.. తిరుమల శ్రీవారి లడ్డూ లాంటి రుచిగల లడ్డూ ప్రసాదం మరొకటి మనకు లభించదు. ఆ టేస్టే వేరేయా అన్నట్లు ఉంటుంది. శ్రీవారిని దర్శించిన తర్వాత .. తిరుమల లడ్డూ ప్రసాదం మాత్రం.. మర్చి పోకుండా అందరూ తెచ్చుకుంటారు. ఎవరైనా.. కొన్ని కారణాల రీత్యా.. తిరుమల.. వెళ్లలేక పోయినా.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తినడం వల్ల.. స్వయంగా ఆ వెంకన్న స్వామి వారే వచ్చి భక్తులను ఆశీర్వదిస్తాడట. ఇదే భక్తుల నమ్మకం.. కొన్ని యుగాలుగా సాగుతోంది. అందుకే తిరుమల లడ్డూ అత్యంత ప్రసిద్ధి చెందింది.