
బీజేపీ పాలు, సిలిండర్లు ఫ్రీ..కాంగ్రెస్ కరెంటు, భృతి ప్రకటన
- NewsPolitics
- May 4, 2023
- No Comment
- 33
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఓ వైపు ప్రచారంతో హోరెత్తిస్తూనే…. ఉచితాలతో ఓటర్లకు గాలం వేస్తున్నారు.పేద, మధ్యతరగతి వర్గాల వారిని ఆకట్టుకునేందుకు …వివిధ పథకాలను, ఫ్రీ ఆఫర్లను ప్రకటిస్తూ వారికి చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరు మ్యానిఫెస్టోలో పాలు, సిలిండర్లు ఫ్రీ అంటే…మరొకరు కరెంటు, నిరుద్యోగ భృతి లాంటి వాటిని సంధించారు.
కర్ణాటకలో ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరుకుంది. అధికారాన్ని నిలుపుకునేందుకు బీజేపీ, తమ హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడుతున్నాయి. అధికారంలోకి వస్తే తామేం చేస్తామో చెబుతూ…జనాకర్షక హామీలతో జనంలోకి వెళ్తున్నాయి . ఉచిత హామీల్లోనూ ఇరు పార్టీలు తగ్గేదేలే అన్నట్టుగా దూసుకెళ్తున్నాయి.
ఉచితాలు వద్దంటూనే, కర్ణాటకలో బీజేపీ ఉచిత హామీల వర్షం కురిపించింది. ఉచిత పాలు, ఉచిత సిలిండర్లు లాంటి హామీలను మేనిఫెస్టోలో చేర్చి ఓటర్లకు గాలమేస్తోంది. రాష్ట్రంలో ఏ.. నందినీ పాల బ్రాండ్ వల్ల బీజేపీ విమర్శలు ఎదుర్కొందో, అదే పాలను కాషాయపార్టీ మేనిఫెస్టోలో చేర్చడం విశేషం.
ఇటీవలే ప్రజా ప్రణాళిక పేరుతో బీజేపీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అందులో, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు ప్రతి రోజు ఉచితంగా అర లీటరు నందిని పాలు, పేద కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం, 5 కేజీల తృణధాన్యాలతో నెలవారీ రేషన్ కిట్ లాంటి హామీలు ప్రకటించింది. ఇక, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు ఏటా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల వాగ్దానం చేసింది. వృద్ధులకు ఉచితంగా వార్షిక హెల్త్ చెకప్లు లాంటి హామీల వర్షం కురిపించింది. ప్రతి వార్డులో అటల్ ఆహార కేంద్రాలు, నిరాశ్రయులకు 10 లక్షల ఇళ్ల స్థలాల కేటాయింపు లాంటివి మ్యానిఫెస్టోలో చేర్చింది.
బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన మర్నాడే కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికను ప్రకటించింది. ఉచిత పథకాల్లో బీజేపీకి తామేం తక్కువ కాదంటోంది. ఆచరణ సాధ్యం కాని హామీలను బీజేపీ తన మేనిఫెస్టోలో చేర్చిందని, కానీ తాము మాత్రం అమలయ్యే హామీలను మాత్రమే చేర్చామని చెప్పుకుంటోంది. జనాంగద శాంతియ తోట పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది.
పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గృహలక్ష్మీ పథకం కింద ప్రతీ కుుటుంబంలోని మహిళలకు నెలకు 2,000.. యువ నిధి ద్వారా నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు 3,000, డిప్లొమా ఉన్నవారికి నెలకు 1,500 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. బీపీఎల్ కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 10 కిలోల ఆహారధాన్యాలు…. కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించింది. ఉద్యోగాల కల్పన, మహిళా సాధికారత, నిరుద్యోగ నిర్మూలన, రైతు సంక్షేమం వంటి అంశాలను చేర్చింది.
మొత్తంగా…పేద, మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ లు ఇచ్చిన ఉచిత హామీలు ఏమేరకు వర్కవుట్ అవుతాయి. కన్నడనాట ఎగిరే జెండా ఏది అనేది మే 13నాటి ఫలితాల్లో తేలిపోనుంది.