
వైసీపీ ఫేక్ ప్రచారంపై.. లోకేష్ న్యాయపోరాటం
- Ap political StoryNewsPolitics
- July 12, 2023
- No Comment
- 19
ఒకప్పటి రాజకీయాలు.. ఇప్పటి రాజకీయాలకు చాలా వ్యత్సాసం ఉంది. గతంలో రాజకీయాలు.. కేవలం .. వ్యక్తిగత నిందలు లేకుండా.. ప్రజా సంక్షేమం కోసమే .. సదరు వ్యక్తులు ఆరోపణలు చేసేవారు. ఇప్పుడు అలా కాదు.. తప్పుడు ప్రచారాలు చేయడం, ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పడం, ప్రత్యర్థి వ్యక్తిత్వాన్ని కించపరచడం, లేనిది ఉన్నట్లు సృష్టించడం .. ద్వారా నీతి లేని రాజకీయాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న వైసీపీ.. ఇంగిత జ్ఞానాన్ని కూడా మరిచిపోయి.. వైసీపీ నేతలు, పెయిడ్ బ్యాచ్ ద్వారా.. నీచ రాజకీయాలు చేస్తోంది. వైసీపీ వచ్చాకే.. మరింతగా దిగజారిన రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. వ్యక్తిగతంగా ఆరోపణలు చేసి.. అప్రతిష్ట పాలు చేయడమే.. వైసీపీ ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది.
నిజం గడప దాటేలోపు.. అబద్ధం ఊరు దాటుందని పెద్దలు చెబుతారు. వైసీపీ పెయిడ్ బ్యాచ్ వికృత చేష్టలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. తన పైనా, తన కుటుంబంపైనా అసత్య ఆరోపణలని ప్రచారం చేస్తున్న వైసీపీ నేతల ఫేక్ ప్రచారంపై ..టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ న్యాయపోరాటం మొదలుపెట్టారు. గతంలో కూడా.. తప్పుడు వార్తలు రాస్తూ, తన వ్యక్తిగత అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న సాక్షిపై .. రూ. 75 కోట్ల పరువునష్టం దావా వేశారు. అనంతరం వైసీపీ నేతలు, సోషల్ మీడియా బాధ్యులు కూడా తనని టార్గెట్ చేస్తూ చేసిన అసత్య ప్రచారంపై క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్, ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రభుత్వ చీఫ్ డిజిటల్ డైరక్టర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు దాఖలు చేశారు.
నారా లోకేష్ పిన్ని కంఠమనేని ఉమామహేశ్వరి అనారోగ్య సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే.. ఈ ఆత్మహత్యపై వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి లోకేష్పై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారు. ఉమామహేశ్వరి మరణానికి జూబ్లీ రోడ్డు నెం.45 సర్వే నెం. 273, 274, 275, 276 లలోని 5.73 ఎకరాల భూమి వివాదమే కారణం అని తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా విషప్రచారం చేశారు. తర్వాత.. ఆ సర్వే నంబర్లూ ఫేక్ అని తేలాయి. అయినా గుర్రంపాటి దేవేందర్ రెడ్డి.. మరో కట్టుకథ అల్లి .. మరో విషప్రచారం చేశారు. హెరిటేజ్ లో రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఉమామహేశ్వరిని మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని తప్పుడు రాతలు రాశారు. తప్పుడు రాతలపై గుర్రంపాటి దేవేందర్ రెడ్డికి .. తన లాయర్ దొద్దాల కోటేశ్వరరావు ద్వారా నారా లోకేష్ నోటీసులు పంపారు. గుర్రంపాటి దేవేందర్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్, ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రభుత్వ ఛీఫ్ డిజిటల్ డైరక్టర్ గా పనిచేస్తూడంటంతో.. ఆయా కార్యాలయాలకు నోటీసులు పంపితే తీసుకోలేదు. చివరికి గుర్రంపాటికి వాట్సప్ ద్వారా నోటీసులు పంపారు.
సెప్టెంబరు 2022లో తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ.. నారా చంద్రబాబును సారా చంద్రబాబు నాయుడు అని పిలవాలని కోరారు. హెరిటేజ్ సంస్ధ ద్వారా వ్యాపారం చేస్తున్నామని చెబుతూ సారా పరిశ్రమ నడుపుతున్నారని ఆమె ఆరోపించారు. బీ-3 అంటే భువనేశ్వరి, బ్రాహ్మణి, బాబు అని, వీరు రాష్ట్రంలో సారా ఏరులై పారించి కోట్లు గడించారని తప్పుడు ఆరోపణలు చేశారు. భువనేశ్వరి, బ్రాహ్మణి కొట్టుకున్నారని, లోకేష్కి మగువ, మందు లేనిదే నిద్ర పట్టదంటూ.. చంద్రబాబు, లోకేష్ లకు మందు తాగనిదే మాట పెగలదని సునీత వ్యాఖ్యానించారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం తనపైనా, తన కుటుంబంపైనా పోతుల సునీత చేసిన దారుణమైన తప్పుడు వ్యాఖ్యలపై నారా లోకేష్ మంగళగిరి కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, పోతుల సునీతలపై దాఖలు చేసిన కేసుల్లో ఐపిసి సెక్షన్ 499, 500 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ కేసులో పిటిషనర్ అయిన నారా లోకేష్ వాంగ్మూలాన్ని మంగళగిరి అడిషినల్ మేజిస్ట్రేట్ కోర్టులో .. ఈ నెల 14న నమోదు చేయనున్నారు. యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ 12న పాదయాత్ర ముగించుకొని బయలుదేరి అమరావతి రానున్నారు. కోర్టు పనులపై .. వస్తూండటంతో.. యువగళం పాదయాత్రకి 13,14వ తేదీలలో విరామం ప్రకటించారు.
వైసీపీ మూక చేస్తున్న ఈ అబద్ధపు ప్రచారంపై చట్టపరమైన చర్యలకు.. నారా లోకేష్ నడుం బిగించారు. నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నా.. అబద్ధాలు ప్రచారం చేసే ప్రతీ ఒక్కరికీ.. తగిన బుద్ధి చెప్పేలా నారా లోకేష్ రంగంలోకి దిగారు. వైసీపీ పెయిడ్ బ్యాచ్ అసత్యాన్ని ప్రచారానికి చెక్ పెట్టేందుకు ఒక కారణం అయితే.. అసలైన వాస్తవాలు ప్రజలు గ్రహించాలని కోరేందుకే.. కోర్టుల్లో తన న్యాయపోరాటం ముఖ్య ఉద్దేశమని నారా లోకేష్ చెబుతున్నారు.ఫేక్ విషయాలను ఉన్నట్లు ప్రచారం చేస్తే.. కఠిన చర్యలు తీసుకోవాలని.. నారా లోకేష్ కోరుతున్నారు.