
కాపులను నట్టేట ముంచిన జగన్ రెడ్డి
- Ap political StoryNewsPolitics
- June 5, 2023
- No Comment
- 24
ఏపీలో కాపుల అభ్యున్నతి కోసం టీడీపీ విశేషంగా కృషి చేసింది. కాపుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్నో బృహత్తర కార్యక్రమాలను చేపట్టింది. కాపులను రాజకీయంగా, ఆర్థికంగా పైకి తీసుకొచ్చింది. విద్యా, ఉద్యోగాల కల్పనలో ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు… ఈడబ్ల్యుఎస్ కోటాలో 5 శాతం రిజర్వేషన్లు కల్పించింది. టీడీపీ హయాంలో కాపుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి… 3వేల 100 కోట్లు ఖర్చు చేసింది. కాపు కార్పొరేషన్ ద్వారా 66.50కోట్ల రుణాలు ఇచ్చింది. 33,594 మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇప్పించింది. ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పథకం ద్వారా 4వేల528 మంది విద్యార్ధుల్ని విదేశాల్లో చదివించడంతో పాటు… ఎన్టీఆర్ ఉన్నత విద్యా పథకం ద్వారా రూ.28 కోట్లతో ఒక వెయ్యి 413 మంది విద్యార్ధులకు లబ్ది చేకూర్చింది. ప్రతి జిల్లాలో 5 కోట్లతో కాపు భవన్ నిర్మించింది.
పదవుల పంపకాల్లోనూ కాపులకు టీడీపీ పెద్దపీట వేసింది. ఆ సామాజిక వర్గానికి చెందిన చినరాజప్పకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చింది. రాయలసీమలో రాజంపేట నుండి 12 సార్లు బలిజ వ్యక్తిని పార్లమెంటుకు పంపించిన ఘనత టీడీపీదే. కానీ, జగన్ రెడ్డి మాత్రం రాజంపేట ఎంపీ సీటును మిథున్ రెడ్డికి కట్టబెట్టి బలిజలను వంచించారు. తిరుపతి అసెంబ్లీ సీటును తెలుగుదేశం పార్టీ బలిజలకు కేటాయిస్తే, జగన్ రెడ్డి సొంత వర్గానికి కట్టబెట్టాడు. బలిజ వర్గానికి చెందిన సి.రామచంద్రయ్యకు రెండుసార్లు రాజ్యసభ్యుడిగా టీడీపీ అవకాశం కల్పించింది. పసుపులేటి బ్రహ్మయ్యకు మంత్రి పదవి, చదలవాడ కృష్ణమూర్తిని టీటీడీ ఛైర్మన్ గా నియమించింది. బి.కె.సత్యప్రభకు ఎమ్మెల్యే సీటు ఇచ్చి, ఆమె భర్త ఆదికేశవులు నాయుడుని ఎంపీ చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే కాపుల కోసం టీడీపీ చేసిన కృషి ఎంతో ఉంది.
కానీ, జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల మాదిరే కాపులు బాధితులుగా మారారు. జగన్ రెడ్డి కాపు కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ప్రతి సంవత్సరం కాపులకు 2వేల కోట్ల రూపాయలు కేటాయించి, ఖర్చు చేస్తాము అన్న వాగ్దానానికి తూట్లు పొడిచారు? ఒక్క రుపాయి రుణం ఇచ్చిన పాపాన పోవడం లేదు. ఇక, కాపు రిజర్వేషన్ రద్దుతో ఉద్యోగాలు కోల్పోయారు. స్కూళ్లు, కాలేజీల్లో రిజర్వేషన్ ఆధారంగా లభించే సీట్లు కోల్పోయారు. పేదవిద్యార్థులు విదేశాల్లో చదవకూడదనే ఆలోచనతో టీడీపీ హయాంలోని పథకాలను రద్దు చేశారు. కాపు భవన్ కోసం టీడీపీ 165కోట్లు కేటాయిస్తే ఆ నిర్మాణం సైతం జగన్ ఆపివేశాడు.
కాపు కార్పొరేషన్ రుణాలకు చేసుకున్న 47 వేలకు పైగా దరఖాస్తులను సైతం జగన్ సర్కార్ రద్దు చేసింది. అన్ని వర్గాల్లోని మహిళలకు ఇచ్చే పథకాన్నే కాపు నేస్తం పేరుతో…కాపులకు ప్రత్యేకంగా ఇస్తున్నట్లు జగన్ కలరింగ్ ఇచ్చుకోవడాన్ని లోకేష్ దుయ్యబట్టారు. రైతు భరోసా పథకాన్ని కాపులకు దూరం చేసి… రైతుల్ని కులాల వారీగా జగన్ విడగొడుతున్న విధానంపై లోకేశ్ మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రిజర్వేషన్ను పునరుద్ధరించడంతో పాటు అన్ని పథకాలు కొనసాగిస్తామని లోకేశ్ తన మైదుకూరు పాదయాత్రలో భరోసా ఇచ్చారు.