
ఒడిషాలో మూడు రైళ్లు ఢీకొని 250మంది మృతి
- News
- June 3, 2023
- No Comment
- 25
ఒడిషాలో ఘోర ప్రమాదం జరిగింది. అంతులేని విషాదం చోటుచేసుకుంది. బాలేశ్వర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో వందలామంది మరణించారు. నిద్రలోనే చాలా మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఈ దుర్ఘటనలో 250మందికి పైగా ప్రాణాలు కోల్పోగా…దాదాపు వెయ్యిమంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్లోని హావ్డాకు వెళ్తున్న బెంగళూరు-హావ్డా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్…. బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద పట్టాలు తప్పింది. దాంతో, బోగీలు పక్కనే ఉన్న ట్రాక్పై పడిపోగా…. వాటిని షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. కోరమండల్ ఎక్స్ప్రెస్కు చెందిన 15 బోగీలు కూడా పల్టీకొట్టాయి. బోల్తాపడ్డ కోరమండల్ కోచ్లను పక్కనున్న ట్రాక్పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది. శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అంతా నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది.
ఇంకా చాలా మంది పట్టాల మధ్యలో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వారిని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలాసోర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు రక్తం ఇచ్చేందుకు చాలా మంది బారులు తీరారు.