
బీజేపీ, జగన్ కు షాక్ ఇచ్చిన పవన్..?
- Ap political StoryNewsPolitics
- September 15, 2023
- No Comment
- 15
ఏపీలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీ అధినేత జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటివరకు ఎవరి రాజకీయం వారు చేసిన టీడీపీ, జనసేన పార్టీలు..ఇప్పుడు ఇద్దరూ కలిసి ఫీల్డ్ దిగుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీలు ఏకమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు సిద్ధమని జనసేనాని ప్రకటించారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న పవన్ తాను టీడీపీతో కలిసి వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాదు, చంద్రబాబును టచ్ చేసిన జగన్ కు..తామేంటో చూపిస్తామంటూ బీమ్లానాయక్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటివరకు ఓ లెక్క, ఇక నుంచి ఓ లెక్క…కాస్కో జగన్ అంటూ యుద్ధ సైరన్ మోగించారు. పవన్ పేల్చిన బాంబ్ లాంటి వార్తతో జగన్ కోటరీలో భయం మొదలైంది. జగన్ అవినీతి, అరాచక పాలనపై పోరాటానికి ఉమ్మడి కార్యాచరణ కూడా సిద్ధమైపోతోంది.
కొంతకాలంగా టీడీపీ, జనసేన మధ్య పొత్తుపై రకరకాలుగా వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి వెళ్లకుండా, ఢిల్లీ కేంద్రంగా జగన్ అడ్డుపడుతున్నారనే ఊహగానాలు వినిపించాయి. వాటన్నింటికీ తెరదించుతూ… పవన్ పొత్తును కన్ఫార్మ్ చేశారు. ఇంతకాలం బీజేపీ కూడా కలిసొస్తుందని ఎదురుచూసిన పవన్… ఆశలు వదిలేసుకున్నట్టే కనిపిస్తోంది.అందుకే, కాషాయ పార్టీతో సంబంధం లేకుండా తన ప్రయాణం టీడీపీతోనని చెప్పకనే చెప్పేశారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో దూరంగా ఉండిపోవడం, వైసీపీకి పరోక్షంగా మద్దతివ్వడం పట్ల బీజేపీపై పవన్ ఆగ్రహంతో ఉన్నారు. దీంతో, బీజేపీతే తాడోపేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి చంద్రబాబు, పవన్ లు వచ్చారు. ఈ క్రమంలోనే రాజమండ్రి సెంట్రల్ జైలులో.. బాలకృష్ణ, లోకేష్ లతో కలిసి చంద్రబాబుతో ములాఖత్ అయిన పవన్ కళ్యాణ్… బీజేపీతో ఎలాంటి చర్చలు లేకుండానే టీడీపీ, జనసేనల మధ్య పొత్తును ప్రకటించేశారు.
రాష్ట్రంలో చంద్రబాబు పర్యటనలు, లోకేష్ యువగళం పాదయాత్రతో జగన్ కు ఓటమి భయం పట్టుకుంది. ఈ క్రమంలోనే అక్రమ కేసులు మోపి టీడీపీ అధినేతను కుట్రపూరితంగా జైలుకు పంపించారు. లోకేష్ ను కూడా స్కిల్ డెవలప్ మెంట్, ఫైబర్ గ్రిడ్ కేసులో ఇరికించాలనే కుట్ర చేస్తున్నారు. మరోవైపు, చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్ ను అణచివేసే చర్యలకు దిగింది వైసీపీ. అయితే, బాబు అరెస్ట్ వెనక కేంద్ర పెద్దల హస్తముందనే అనుమానాలు బలపడుతున్నాయి. అప్పుల దగ్గర్నుంచి, కేసుల వరకు ప్రతి విషయంలో జగన్ కు… మోడీ సర్కార్ సపోర్ట్ గా నిలుస్తూ వస్తోంది. దీంతో, ఇన్నాళ్లు బీజేపీతో పొత్తు కోసం ఎదురుచూసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు… ఇక ఏమాత్రం ఉపేక్షించకూడదనే నిర్ణయానికి వచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా బీజేపీకి షాక్ ఇస్తూ జగన్ పై సమరశంఖం పూరించారు.