
రక్తదానానికి కదిలొచ్చిన యువకులు
- News
- June 4, 2023
- No Comment
- 21
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీ కొన్న ఘటన వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఈ విపత్కర పరిస్థితుల్లో కొందరు స్థానికులు మానవత్వాన్ని చాటుకున్నారు. గాయపడిన వారికి రక్తం అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.
బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో 238 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 900 మందికి పైనే గాయపడ్డారు. క్షతగాత్రులను బాలేశ్వర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పలు సమీప ఆసుపత్రులకు తరలించారు. అయితే ఈ పరిస్థితుల్లో గాయపడిన వారికి రక్తం అవసరం ఉంటుందని ఆలోచించిన వందలాదిమంది యువకులు నిన్న రాత్రే బాలేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు.
వీరంతా ఏ పిలుపూ లేకుండానే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. గంటల తరబడి వేచి ఉండి మరీ.. క్షతగాత్రులకు రక్తదానం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు చురుగ్గా స్పందించారు. ఘటనాస్థలానికి వెళ్లి సహాయకచర్యలు చేపట్టారు. బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ‘‘ప్రమాదం గురించి తెలియగానే మేం వెంటనే అక్కడకు బయల్దేరాం. దాదాపు 200-300 మందిని కాపాడగలిగాం’’ అని ఓ స్థానికుడు మీడియాతో అన్నారు.