
వందో ఎపిసోడ్ సందర్భంగా మోడీ భావోద్వేగ ప్రసంగం
- NewsPolitics
- May 1, 2023
- No Comment
- 26
ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న మన్ కీ బాత్ రేడియో ప్రోగ్రామ్.. మరో మైలురాయిని అందుకుంది. ప్రతి నెల చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్ కీ బాత్ హండ్రెడ్ ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా దేశ వ్యాప్తంగా 4 లక్షల ప్రాంతాల్లో మన్ కీ బాత్ కార్యక్రమం చూసేందుకు వీలుగా.. స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో నెల ఒక్కో టాపిక్ తో రేడియో ద్వారా ప్రజలతో మమేకమవుతున్నారు మోడీ. ప్రధాని రేడియో ద్వారా ప్రజలతో పంచుకునే మాటలను… ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం సహా ప్రపంచవ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ నిర్వహించారు.
వందో ఎపిసోడ్ సందర్భంగా మోడీ కీలక ప్రసంగం చేశారు. గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. 2014లో విజయదశమి రోజున మన్ కీ బాత్ ప్రారంభించామన్న మోడీ… ప్రతి నెలా ఇలాంటి పండుగ వస్తుందని, దాని కోసమే మనందరం ఎదురుచూస్తున్నామని అన్నారు. సామాన్యుల సమస్యల పరిష్కారానికి, ప్రజలతో అనుబంధానికి మన్ కీ బాత్ కార్యక్రమం వేదికైందని తెలిపారు. ప్రజల నుంచి తనకు వేల సంఖ్యలో లేఖలు, సందేశాలు వచ్చాయని, వాటిని చదువుతున్నప్పుడు భావోద్వేగాలకు లోనయ్యానని తన అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమం వల్ల తాను అసామన్య సేవలు అందించిన పలువురు గురించి తెలుసుకున్నట్లుగా మోడీ తెలిపారు. సమాజంలో ఎన్నో మార్పులకు మన్ కీ బాత్ శ్రీకారం చుట్టిందని అన్నారు.
వందో ఎపిసోడ్ సందర్భంగా ప్రధాని పలువురితో ప్రత్యేకంగా మాట్లాడారు. మణిపూర్ కు చెందిన విజయశాంతిదేవి తో సంభాషించారు. మహిళల సాధికారత కోసం పనిచేస్తున్నారు విజయశాంతి. తన ఉత్పత్తులకు మంచి డిమాండ్ వస్తుందని, ఇతర దేశాల నుండి కూడా ఆర్డర్స్ వస్తున్నాయని విజయశాంతి తెలిపింది. అలాగే విశాఖకు చెందిన వెంకట ప్రసాద్ గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. భారతీయ వస్తువులే ప్రసాద్ ఎక్కువ ఉపయోగిస్తారని ప్రధాని అభినందించారు. యూనెస్కో డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ సేవలను అభినందించారు. పర్యావరణం గురించి అవగాహనతో ఉండాలన్నారు. తన ఆలోచనలను ప్రజలతో పంచుకున్నానని తెలిపారు.
అక్టోబరు 3, 2014న ప్రారంభమైన మన్ కీ బాత్ కార్యక్రమం ఇండియాలో 22 ప్రముఖ భాషలు, 29 మాండలికాలతో పాటూ….ఫ్రెంచ్, చైనీస్, ఇండోనేషియన్, టిబెటన్, బర్మీస్, బలూచి, అరబిక్, పష్టు, పర్షియన్, దరి, స్వాహిలితో సహా 11 విదేశీ భాషలలో కూడా ప్రసారం అవుతుంది. ఆల్ ఇండియా రేడియోకు చెందిన 500కి పైగా ప్రసార కేంద్రాల ద్వారా మన్ కీ బాత్ ప్రసారమవుతోంది. వంద ఎపిసోడ్ లో మోడీ ప్రసంగాన్ని దేశ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని బీజేపీ నేతలు కూడా వీక్షించారు.