
ORR టెండర్లలో వేల కోట్లు చేతులు మారాయా?
- NewsPoliticsTelangana Politics
- May 5, 2023
- No Comment
- 37
భాగ్యనగరానికి మణిహారమైన ORR ఔటర్ రింగ్ రోడ్డును.. ప్రభుత్వంపై ప్రైవేటు సంస్థకు 30ఏళ్లకు లీజుకు కట్టబెట్టడంపై…. విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఆస్తులను ప్రైవేటుకు కట్టబెట్టడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. టెండర్లలో వేల కోట్లు చేతులు మారిననట్లు ఆరోపిస్తున్నాయి. ఓఆర్ఆర్ నిర్వహణ, టోల్ వసూలు హక్కులను గంపగుత్తగా 30 ఏళ్లకు…. ముంబై కంపెనీ ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్కి ప్రభుత్వం అమ్మేసింది.
ఈ నిర్ణయంతో ఒకేసారి ఏకమొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.7,380 కోట్లు వచ్చిపడింది. అయితే, ఆశించిన ఆదాయానికన్నా తక్కువకే హక్కులను ధారపోయడంపై అనేక అనుమానాలు తలెత్తున్నాయి. ఎన్హెచ్ఏఐ నిబంధనల ప్రకారమే టెండర్లు పిలిచామంటున్న అధికారులు, ఆ ప్రక్రియ వివరాలను చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచడం గమనార్హం.ఇకపై 30 ఏళ్ల పాటు ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ, టోలు వసూలు ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాధ్యతలు తీసుకుంటుంది.
2006లో ఉమ్మడి రాష్ట్రంలో 158 కి.మీ.మేర నెహ్రూ ఔటర్ రింగ్రోడ్డు నిర్మాణాన్ని హెచ్ఎండీఏ ప్రారంభించింది. పలు జాతీయ, రాష్ట్ర రహదారులు దీనికి అనుసంధానమై ఉన్నాయి. హైదరాబాద్ గ్రోత్కారిడార్ లిమిటెడ్ ఏర్పాటు చేసి, రుణాలు సేకరించింది. రూ.6,696 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేసింది. హైదరాబాద్కు మణిహారంగా మారిన ఓఆర్ఆర్ ప్రజలకు సౌకర్యంగా, ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేలా బంగారు గుడ్లు పెట్టే బాతుగా ఉంది.
టోల్ వసూళ్ల కిందనే ఏటా రూ.400-450 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. ఏటా 5 శాతం వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం దీని నిర్వహణ అంతా హెచ్ఎండీఏనే చూస్తోంది. అయితే, నిధులు, మానవ వనరుల కొరతతో నిర్వహణ భారంగా మారుతోందనే సాకుతో ప్రైవేటుకు ధారాదత్తం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం 11 అంతర్జాతీయ స్థాయి నిర్మాణ సంస్థలు బిడ్ లో పోటీ పడగా… నాలుగు సంస్థలు అర్హత సాధించాయి. చివరకు, జాతీయ రహదారుల నిర్వహణలో అతిపెద్ద సంస్థగా పేరొందిన… ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్… రూ. 7,380 కోట్లకు ఈ లీజును పొందింది.
ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఐఆర్బీ కంపెనీని ముందు పెట్టి తరువాత కేటీఆర్ బినామీ కంపెనీలతో ఇందులోకి ప్రవేశించే కుట్ర జరుగుతోందని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ను తక్కువకే ప్రయివేటుకు కట్టబెట్టడమేంటని ప్రశ్నించారు.
దీనిపై స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, డీవోపీటీకు అరవింద్ కుమార్పై ఫిర్యాదు చేస్తామన్నారు. ఓఆర్ఆర్ అంశంపై కాగ్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. దీని వెనక గూడుపుఠాణి ఏమిటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తక్షణమే టెండర్లను రద్దు చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
అటు బీజేపీ కూడా ఓఆర్ఆర్ లీజు టెండర్లలో గోల్ మాల్ జరిగిందని ఆరోపిస్తోంది. మంత్రి కేటీఆర్ , ఎమ్మెల్సీ కవిత సన్నిహితులకే ఓఆర్ఆర్ లీజు దక్కిందని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఐఆర్ఎబీ కంపెనీ రూ. ఓఆర్ఆర్ పై బేస్ ప్రైజ్ ను నిర్ణయించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిలైందని రఘునందన్ విమర్శించారు . అయితే, హెచ్ఎండీఏ మాత్రం అంతా పారదర్శకంగానే జరిగిందని అంటోంది. ఓఆర్ఆర్ బిడ్డింగ్ లో బేస్ ప్రైస్ కన్నా ఎక్కువ వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
మొత్తంగా, భాగ్యనగరానికి బంగారు బాతులా మారిన ఓఆర్ఆర్ ను.. ప్రైవేటుకు అప్పగించడంపై రాజకీయ దుమారం రేగుతోంది. లీజు వెనక భారీ కుంభకోణమని ఆరోపిస్తున్న విపక్షాలు, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు సన్నద్ధమవుతున్నాయి.