
రూ.715 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్కు అధునాతన హంగులు
- NewsPoliticsTelangana Politics
- April 8, 2023
- No Comment
- 33
దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు మహర్ధశ పట్టనుంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ పనులకు శ్రీకారం పడింది. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ త్వరలో పూర్తిగా కొత్తరూపు సంతరించుకోనుంది. ఎప్పుడో దశాబ్దాల క్రితం కట్టిన పాత స్టేషన్ ప్రాంగణాన్ని పూర్తిగా మార్చేయనున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును తలపించేలా.. దీన్ని మార్చేయనున్నారు. అత్యాధునిక హంగులు, వసతి సదుపాయాలతో.. కళ్ళు చెదిరేలా దీనిని అందుబాటులోకి తేనున్నారు. సుమారు 715 కోట్ల భారీ అంచనాలతో చేపట్టే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు ప్రధాని మోడీ శ్రీకరం చుట్టారు.స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఇక.. దక్షిణ భారతేశంలోనే అతి పెద్ద రైల్వే కూడలిగా సికింద్రాబాద్ స్టేషన్ గుర్తింపు పొందింది.ఈ స్టేషన్ మీదుగా డైలీ 121 ప్యాసింజ్, ఎక్స్ ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. మరోవైపు పెద్ద సంఖ్యలో గూడ్స్ రైళ్లు కూడా తిరుగుతుంటాయి. ఇక గరిష్ఠంగా రోజుకు 1.40 లక్షల మంది, పండుగ రోజుల్లో 1.80 లక్షల మంది సికింద్రాబాద్ నుంచి ప్రయాణిస్తున్నారు. అయితే దీన్ని ఎప్పుడో నిజాం కాలంలో నిర్మించారు. తరువాత మార్పులు, చేర్పులూ చేసినా పెద్దగా అభివృద్ధి చేయలేదనే చెప్పాలి. చేసిన అరకొరా మార్పులు కూడా ఇప్పుడు పనిచేయకుండా ఉన్నాయి. అందుకే దీన్ని పూర్తిగా మార్చేయాలని డిసైడ్ అయ్యారు. మొత్తం 715 కోట్లతో ఎయిర్ పోర్ట్ ను తలదన్నేలా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. 2025 అక్టోబరులోగా పనులన్నీంటిని పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో రైల్వేశాఖ ముందుకు సాగుతోంది.
ఇక..సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల్లో భాగంగా.. ఉత్తరం వైపున 22 వేల 156 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మూడంతస్తుల కొత్త భవనం నిర్మించనున్నారు. దక్షిణం వైపున్న భవనాన్ని జీ+3 అంతస్తులతో విస్తరించనున్నారు. 14 వేల 792 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రయాణికుల సౌకర్యార్థం మొదటి స్థాయిలో 108 మీటర్ల వెడల్పుతో రెండతస్తుల అధునాతన భవన సముదాయాలను, స్కైవేలను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా సాధారణ ప్రజల కోసం రెండో స్థాయిలో రూఫ్టాప్ ప్లాజాను నిర్మించనున్నారు.స్టేషన్లో సెల్లార్ పార్కింగ్ తోపాటు గ్రౌండ్ ఫ్లోర్లో ప్రయాణికుల కోసం టికెట్ బుకింగ్ కేంద్రాన్ని నిర్మించబోతున్నారు. ఒక్కో ప్లాట్ఫామ్ మీద 2 ఎస్కలేటర్,లు క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు.దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్లు అందుబాటులోకి తేనున్నారు.ఆటో, కారు, బైకులు నేరుగా స్టేషన్ వద్దకు వచ్చి తిరిగి బయటకు వెళ్ళేందుకు రూట్ ను ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నిటితో పాటూ ప్రయాణికులకు సేవలందించేందుకు వైఫై ఏర్పాటు చేస్తున్నారు. ప్లాట్ఫామ్ మీదనున్న సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ , ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్లకు కూడా కొత్త భవనాలు అందులోనే ఏర్పాటు చేయనున్నారు.
రెండేళ్ల వ్యవధిలోనే సికింద్రాబాద్ స్టేషన్ రూపురేఖలను పూర్తిగా మార్చేసేలా రైల్వే శాఖ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ప్రస్తుతం సంత మార్కెట్ ను తలపించేలా ఉన్న సికింద్రాబాద్ స్టేషన్ పరిసరాలు పూర్తిగా కొత్త రూపు సంతరించుకోనున్నాయి. దీంతో రాజధాని ప్రజలతో పాటు.. సికింద్రాబాద్ మీదుగా ప్రయాణం చేసే వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.