
బెంగళూరులో సోనియాగాంధీతో షర్మిల భేటీ?
- NewsPoliticsTelangana Politics
- July 14, 2023
- No Comment
- 19
వైటీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ లో చేరికపై హైడ్రామా కొనసాగుతోంది. కాంగ్రెస్ కు మద్దతుగా కొంతకాలంగా కామెంట్స్ చేస్తున్న ఆమె..హస్తం గూటికి చేరడం ఖాయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, షర్మిల రాకను కొందరు మోకాలడ్డుతోన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె రాజకీయం తెలంగాణలోనేనా లేక ఏపీకి వెళ్తారా? అనేది సందిగ్ధంగా మారింది. తెలంగాణలోనే ఉంటానని షర్మిల కోరుతుంటే..ఏపీకి వెళ్లాల్సిందేనని కాంగ్రెస్ కండీషన్ పెడుతోందట. ఈ క్రమంలో షర్మిల సోనియాతో భేటీ కానున్నారన్న వార్త పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్ కు దూరమైంది వైఎస్ ఫ్యామిలీ. అయితే, కొంతకాలంగా తిరిగి కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల చేస్తున్న ప్రయత్నాలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. షర్మిల కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం కొద్దిరోజులుగా సాగుతోంది. షర్మిల సైతం అవే సంకేతాలు ఇస్తున్నారు. పలుమార్లు ఆమె కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ తో భేటీ కావడం, రాహుల్ కు బర్త్ డే విషెస్ చెప్పడం ద్వారా ఆమె కాంగ్రెస్ కు చేరవయ్యే ప్రయత్నంగా కనిపించింది. అంతేకాదు, ఇటీవల వైఎస్సార్ జయంతి సందర్భంగా రాహుల్ చేసిన ట్వీట్ కు షర్మిల కృతజ్ఞత చాటుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో ఆమె త్వరలో సోనియాగాంధీని కలవబోతున్నారన్న వార్త ఆసక్తిని రేపుతోంది.
షర్మిల కాంగ్రెస్ లో చేరే విషయంలో కొన్ని చిక్కుముడులు ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లోని కీలక నేతలు, ముఖ్యంగా రేవంత్ వర్గం షర్మిల రాకపైన కండీషన్లు పెడుతోంది. షర్మిల కాంగ్రెస్ లో చేరితే… ఆంధ్రావాళ్లనే ముద్ర వేసి కేసీఆర్ తనకు అనుకూలంగా మల్చుకునే అవకాశముందంటున్నారు పార్టీ నేతలు. అదే సమయంలో, తెలంగాణలో షర్మిల నాయకత్వాన్ని అంగీకరించేది లేదని రేవంత్ బహిరంగంగానే చెబుతున్నారు. ఆమెను ఏపీకి పంపిస్తే స్వాగతిస్తామంటున్నారు. అటు, కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవాలని షర్మిలకు షరతులు పెడుతోందట. అయితే, అన్నకు ఎదురెళ్లేందుకు షర్మిల సాహసం చేయడం లేదని, తాను తెలంగాణలోనే ఉంటానని చెబుతున్నారట. ఈ క్రమంలో నేరుగా సోనియాతో చర్చించాలని షర్మిల నిర్ణయించారు.
ఈ నెల 17, 18 తేదీల్లో బెంగుళూరులో బీజేపీ వ్యతిరేక పార్టీల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సోనియా గాంధీ హాజరు కానున్నారు. ఈ సమయంలోనే షర్మిల బెంగళూరులో సోనియాతో భేటీ కానున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు తొలి నుంచి షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు మధ్యవర్తిత్వం వ్యవహరిస్తున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అప్పాయింట్ మెంట్ ఖరారు చేయించినట్లు తెలుస్తోంది. షర్మిల వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం పైన ప్రతిపాదనలు వచ్చాయి. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తేనే తదుపరి చర్చలు ఉంటాయని షర్మిల భర్తకు కాంగ్రెస్ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్ స్పష్టం చేసినట్లుగా తెలిసింది. ఇప్పుడు సోనియాతో షర్మిల భేటీ సమయంలో విలీనం దిశగా అంగీకారం చెప్పే అవకాశం ఉందంటున్నారు.
షర్మిలను కాంగ్రెస్ లో చేర్చుకొని ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల పైన ముందుగా ఫోకస్ చేసిన కాంగ్రెస్ , ఆ తరువాత షర్మిల సేవలను ఏపీలో వినియోగించుకోవాలనే ఆలోచనలో ఉంది. మొత్తంగా, సోనియాతో చర్చల తర్వాత షర్మిల పార్టీలో చేరిక, బాధ్యతల పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.