
స్వరూపానంద చిందులకు అసలు కారణం అదేనా..?
- Ap political StoryNewsPolitics
- April 25, 2023
- No Comment
- 38
“సింహాద్రి అప్పన్న చందనోత్సవం ఇంత వరస్ట్ గా ఎప్పుడూ జరగలేదు..!” “గర్భగుడిలో సైతం పోలీసుల జులుం ఎక్కువైంది..!!” ” భక్తులకు ఏ రకమైన సౌకర్యాలు లేవు..!!” “ఆరు నెలల నుంచి ఈవోను కూడా ఈ ప్రభుత్వం నియమించ లేక పోయింది..!” “అసలు ఇలాంటి ఆలయానికి దర్శనానికి ఎందుకు వచ్చానా..?” అని ఆలోచిస్తే.. కన్నీళ్ళు వస్తున్నాయి… అంటూ ఏపీ ప్రభుత్వ “రాజగురువు” స్వరూపానంద…. జగన్ రెడ్డి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. కనీసం ఓ ఆలయ ఉత్సవాల్ని సైతం సరిగ్గా నిర్వహించలేని చేతగాని స్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందంటూ నిప్పులు చెరిగారు. అయితే.. ఒకప్పుడు జగన్ పై ముద్దులు కురిపించిన ఈ రాజగురువు.. అకస్మాత్తుగా ఎందుకు మాట మార్చారు..? “జగనే నా ప్రాణం” అన్నట్టుగా వ్యవహరించే స్వరూపానంద స్వరంలో ఆ తేడా ఎందుకు వచ్చింది..?
స్వరూపానంద..! విశాఖ శారదా పీఠం నిర్వహిస్తున్న ఈయన.. ఏపీ సీఎం జగన్ రెడ్డికి రాజగురువుగా ఉన్నారు. రాజాశ్యామల యాగాలు, పూజలతో బాగా పాపులర్ అయిన స్వరూపానందకు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్తులకు కొదువ లేదు. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈయనగారి భక్తుల లిస్టు కొండవీటి చాంతాడంత ఉంటుంది. వైసీపీ ప్రభుత్వానికి రాజగురువుగా ఉన్న స్వరూపానంద.. అకస్మాత్తుగా తన శిష్యుడైన జగన్ రెడ్డి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సింహాచలం అప్పన్న సాక్షిగా.. జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన ఎండగట్టిన తీరు.. వైసీపీ వర్గాలకు మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చింది.
జగన్ రెడ్డిపై స్వరూపానంద ఆగ్రహానికి.. అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది. ఇటీవల వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర రెడ్డి అరెస్టు అయినప్పుడు.. చోటు చేసుకున్న పరిణామాలే స్వామి వారి ఆగ్రహానికి కారణం అయ్యాయని అంటున్నారు. వైఎస్ భాస్కర రెడ్డి అరెస్టు సందర్భంగా సీఎం జగన్ రెడ్డి… మైసూరు నుంచి విజయ్ కుమార్ అనే జ్యోతిష్యుడిని ప్రత్యేక విమానంలో విజయవాడ రప్పించారు. విజయ్ కుమార్ను మహిమాన్వితమైన స్వామీజీగా.. వైవీ సుబ్బారెడ్డి అభివర్ణించారు. అయితే.. ఇవన్నీ స్వరూపానంద ఆగ్రహానికి కారణమయ్యాయనే టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. రాజగురువు అయిన తనతో కాకుండా.. ఎవడో అనామకుడైన విజయ కుమార్ ను పిలిపించి ఆశీర్వాదం తీసుకోవటం ఏంటి..? అనే కడుపుమంట స్వరూపానందలో ఉందని చెబుతున్నారు. జగన్ రెడ్డి క్రమంగా తనకు ప్రాధాన్యం తగ్గిస్తున్నారనే భావనతోనే స్వరూపానంద సింహాచలంలో చిందులు తొక్కారని అంటున్నారు.
ఇక.. సింహాచలం చందనోత్సవ ఏర్పాట్లలో ఘోరంగా విఫలమైన ఏపీ ప్రభుత్వంపై… స్వరూపానంద తీవ్ర విమర్వలు చేయటంతో ఆయన ఫ్లేటు ఫిరాయిస్తున్నారా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీ ప్రభుత్వ రాజగురువుగా స్వరూపానంద ఇప్పటికే.. పొందాల్సిన గౌరవ మర్యదల కన్నా ఎక్కువ పొందుతున్నారు. స్వరూపానందతో పాటు అతడి శిష్యుడికి సైతం గన్ మెన్లను జగన్ రెడ్డి కల్పించారు. ఎక్కడికి వెళ్ళినా వీవీఐపీ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. అటువంటి స్వరూపానంద.. జగన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు.. విశాఖ చందనోత్సవానికి వీవీఐపీగానే స్వరూపానంద వెళ్ళారు. అయితే అక్కడ ప్రభుత్వం, అధికారుల వైఫల్యం వల్ల.. ఆయనకు రెగ్యులర్ గా దక్కే వీవీఐపీ ట్రీట్మెంట్ దక్కలేదని అంటున్నారు. ఇటీవల మైసూర్ విజయ్ కుమార్కు జగన్ వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వటం.. సింహాచలంలో అధికారులు కనీసం తనను పట్టించుకోక పోవటంతో స్వరూపానంద .. జగన్ రెడ్డి ప్రభుత్వంపై ఇలా దుమ్మెత్తి పోశారనే టాక్ కూడా వినిపిస్తోంది.
అయితే.. వైసీపీ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నా మాట్లాడని స్వరూపానంద ఇప్పుడు హడావుడి చేయటంపై.. హిందూ ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ సర్కార్ హయాంలో జరుగుతోన్న క్రైస్తవ మత మార్పిడులపై స్వరూపానంద ఎందుకు నోరెత్తటం లేదని సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద వంటి వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. సింహాచలం అప్పన్న సాక్షిగా జగన్ రెడ్డి ప్రభుత్వంపై చిందులు తొక్కిన స్వరూపానంద.. ఆ తరువాత కొద్ది గంటలకే తన మాట మార్చుకోవటం కొసమెరుపు. తాను జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏమీ అనలేదని వివరణ ఇచ్చుకున్న ఆయన.. అధికారుల నిర్లక్ష్యంపైనే మాట్లాడానని చెప్పుకొచ్చారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన వార్నింగ్ తోనే స్వరూపానంద ఇలా మాట మార్చారనే టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద.. జగన్ రాజగురవు స్వరూపానంద చేసిన తీవ్ర వ్యాఖ్యలు.. ఏపీ ప్రభుత్వానికి శరాఘాతంలా తగిలాయనే చెప్పుకోవచ్చు.