
ఇదే మా బలగం.. మేమంతా కలిసే ఉన్నాం
- NewsPoliticsTelangana Politics
- May 1, 2023
- No Comment
- 33
అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. నల్గొండలో జరిగిన నిరుద్యోగ దీక్షలో.. ఉప్పు, నిప్పులా ఉండే నేతలంతా ఏకమై పార్టీ శ్రేణులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. రేవంత్ ను నల్గొండకు రాకుండా అడ్డుపడుతున్న సీనియర్ నేతలు, పంతం వీడారు. అంతేకాదు, అంతా ఏకమై ఒకరినొకరు ఆలింగనం చేసుకొని, తామంతా ఒక్కటేనని చాటిచెప్పారు. తమ మధ్య ఉన్నది చిన్నపాటటి మనస్పర్థలేనని కొట్టిపారేశారు. అంతా కలిసిపోయి, విజయ సంకేతాలు చూపుతూ పార్టీ కేడర్ ను ఆనందపారవశ్యంలో ముంచెత్తారు. బలగం సినిమాను తలపించిన ఈ సీన్ ను చూసి, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తెగ సంబరపడిపోతున్నారు. అయితే, ఎడమొహం, పెడమొహంగా ఉంటున్న నేతలను ఏకతాటిపైకి తీసుకురావడంలో, పార్టీ సీనియర్ నేత జానారెడ్డి పెద్దన్న పాత్ర పోషించారని తెలుస్తోంది.
నిరుద్యోగ సమస్యపై గట్టిగా ఫోకస్ చేయాలని భావిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ .. అందులో భాగంగానే వివిధ జిల్లాల్లో నిరసన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తోంది. దాంట్లో భాగంగానే ఏప్రిల్ 21న నల్గొండలో నిరుద్యోగ దీక్ష నిర్వహించాలనుకున్నారు. అయితే, తనకు సమాచారం లేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఢిల్లీలో ఉన్నందున రాలేనంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తమ అయిష్టతను వెలిబుచ్చారు. దాంతో, కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేశారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన జానారెడ్డి… ఉత్తమ్, వెంకట్ రెడ్డిలకు సర్దిచెప్పి నల్గొండలో నిరుద్యోగ దీక్షను సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇన్నిరోజులు రేవంత్ రెడ్డిపై అటు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ విమర్శలు చేస్తూ.. అధిష్ఠానానికి తలనొప్పిగా మారిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. నల్గొండలో అందరినీ లాగి లాగి మరీ హత్తుకోవటం చర్చనీయాంశంగా మారింది. ఈ సీన్ మొత్తం చూసి ఉప్పొంగిపోయిన వీహెచ్.. ఇది మా బలగం.. మేమంతా కలిసే ఉన్నాం.. అనే స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో, కాంగ్రెస్ శ్రేణులు ఉప్పొంగిపోయాయి.
మొన్నటిదాకా ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకున్న వారు.. కౌగిలింతలు.. కడుపులో తల పెట్టటాలు.. చేతులు పట్టుకుని ఐక్యతా ప్రదర్శనలు చూసి అంతా షాక్ అవుతున్నారు. అయితే, సీనియర్స్ కు, ఇటు రేవంత్ రెడ్డికి మధ్య వారధిలా ఉన్న జానారెడ్డి చొరవతోనే…. అంతా కలిసి ముందుకు వచ్చినట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం మాత్రమే సమయం ఉండడంతో, ఇప్పుడు కూడా కలిసి నడవకపోతే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం తప్పదని అధిష్టానం ఆలోచనలో పడింది. అందుకే, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలందరని ఏకతాటికి పైకి తీసుకొచ్చే బాధ్యతను జానారెడ్డి భుజానెత్తుకున్నారు. ఇదే రకమైన పంథాను ఎన్నికల్లోనూ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
మొత్తంగా, జిల్లా అగ్రనేతలు అందరూ రేవంత్ సభలో పాల్గొనడం, ఆయనకు అండగా ఉంటామని స్పష్టం చేయడం పార్టీ కేడర్లో జోష్ నింపింది. అంతేకాదు, ఉమ్మడి నల్గొండ జిల్లాను మళ్లీ కాంగ్రెస్ అడ్డాగా మార్చేద్దామంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ లు కేడర్ ను ఉత్సాహపర్చారు . అటు హైకమాండ్ కూడా నల్గొండలో తమ బలగాన్ని చూసి తెగ ముచ్చటపడిపోయిందట.