
పెళ్లి కాకుండానే తల్లి అయ్యేలా..చట్టం చేసిన చైనా
- News
- April 29, 2023
- No Comment
- 30
తమ దేశంలో జనాభా తగ్గుతోందని గాబరా పడుతోంది డ్రాగన్ కంట్రీ. జనాభా పెరుగుదల కోసం దేశంలో త్రీ చైల్డ్ పాలసీ పెట్టినా, పెళ్లైన జంటలు పెద్దగా పట్టించుకోవడం లేదు. పెరిగినన ఖర్చులు, పనిభారంతో కొందరు ఒక్కరే ముద్దంటే, చాలా మంది అసలు పెళ్లి చేసుకునేందుకే ఇష్టపడడం లేదు . దాంతో, ఇప్పుడు కంత్రీ చైనా..కన్నింగ్ ఆలోచన వేసింది. పాపులేషన్ వేగంగా క్షీణిస్తుండడంతో, సంతానోత్పత్తిని పెంచేందుకు వక్రమార్గాలవైపు దృష్టి మళ్లించింది. పెళ్లికాని, ఒంటరి మహిళలు ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కనే వెసులుబాటుని ఇస్తోంది. ఇప్పటివరకు పెళ్లైన జంటలకు మాత్రమే ఉండే పిల్లల సబ్సిడీ, అవివాహిత గర్భిణీలు కూడా పొందవచ్చని చెబుతోంది. అందుకోసం, ఓ అడుగు ముందుకేసి…పెళ్లికాని మహిళల పిల్లల జనన నమోదును చట్టబద్ధం చేసింది.
అవివాహిత స్త్రీలు కూడా వేతనంతో కూడిన ప్రశూతి సెలవులు కూడా తీసుకోవచ్చని ఆఫర్లు ఇస్తోంది. ప్రైవేట్ లేదా పబ్లిక్ ఆస్పత్రుల్లో ఐవీఎఫ్ చికిత్సను పొందవచ్చని ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఐవీఎఫ్ని సరళీకృతం చేస్తే పెద్ద మార్కెట్గా విస్తరించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. సాధారణ సంతానోత్పత్తి సేవలపై ప్రభావం పడుతుందని,భవిష్యత్తులో ఐవీఎఫ్ చికిత్సకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని ఆసియా పసిఫిక్ వ్యాపార అభివృద్ధి డైరెక్టర్ వైవ్ లిప్పెన్స్ హెచ్చరించారు. ఇప్పటివరకు ఎంత మంది మహిళలు ఐవీఎఫ్ ను ఉపయోగించుకున్నారనే దానిపై స్పష్టత లేదు.
ఎప్పుడైతే జనాభా క్షీణించడం ప్రారంభించిందో అప్పటినుంచి చైనా పిల్లలను కనేందుకు ప్రజలకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది. ఈ క్రమంలో పలు నిబంధనలు ఎత్తి వేసి కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఈ ఐవీఎఫ్ చికిత్సా విధానం తెరమీదకు వచ్చింది. యువత తక్కువగా ఉండడం, వృద్ధులు పెరిగిపోతుండడమే అందుకు కారణం. దాని వల్ల భవిష్యత్తులో పనిచేసే వారి సంఖ్య తగ్గిపోతుందన్న భయంతో చైనా చెత్త నిర్ణయాలను తీసుకుంటోంది.
ఇటీవల ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరించింది. ఆ సందర్భంగా చైనా ఇండియాపై తన అక్కసు వెళ్లబోసుకుంది. చైనాలో ఇప్పటికీ 90 కోట్ల మంది ప్రతిభ కలిగిన కార్మికులు ఉన్నారని, జనాభా పెరగినా కూడా వారిలో ప్రతిభ ఉండాలని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. మళ్లీ ఓ పక్క యువత తగ్గిపోతున్నారని, వృద్ధులు పెరిగిపోతున్నారని కంగారుపడిపోతూ…పెళ్లికాని మహిళలను కూడా తల్లులు చేసే నీచ కార్యక్రమాలకు పాల్పడుతోంది.