
సామాన్య భక్తుల సౌలభ్యం కోసం.. ఆర్జితసేవలు, విఐపి దర్శనాల్లో స్వల్ప మార్పులు
- Ap political StoryNews
- May 21, 2023
- No Comment
- 22
తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోవడం, వేసవి సెలవుల కారణంగా శ్రీవారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. సర్వదర్శనం కోసం భక్తులకు దాదాపు 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది. శుక్ర, శని, ఆదివారాల్లో భక్తులు వేచి ఉండే సమయం ఇంకా ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సామాన్యభక్తుల సౌలభ్యం కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
జూన్ 30వ తేదీ వరకు స్వామివారి సేవలు, విఐపి దర్శనాల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్టు టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్ర, శని, ఆదివారాల్లో సుప్రభాత సేవకు విచక్షణ కోటాను రద్దు చేశారు. తద్వారా 20 నిమిషాల సమయం ఆదా అవుతుంది. గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహించనున్నారు. తద్వారా మరో 30 నిమిషాల సమయం ఆదా కానుంది. శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించడం జరగదని టీటీడీ స్పష్టం చేసింది.
కేవలం స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పించనున్నట్లు తెలిపింది. తద్వారా ప్రతిరోజు మూడు గంటల సమయం ఆదా అవుతుంది. క్యూలైన్లలో గంటల తరబడి కిలోమీటర్ల మేర వేచి ఉండే వేలాది మంది సామాన్య భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. తద్వారా వారు త్వరితగతిన స్వామివారి దర్శనం చేసుకోవచ్చని టీటీడీ భావిస్తోంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని భక్తులు, వీఐపీలు సహకరించాలని వైవి.సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.