
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ ఆర్జితసేవలు, దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల
- Ap political StoryNews
- May 19, 2023
- No Comment
- 28
కలియుగ వైకుంఠ దైవం .. తిరుమల శ్రీవారిని దర్శిస్తే.. కోటి జన్మల ఫలం. అందుకే.. తిరుమలలో నిత్యం భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంటుంది. తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం కోసం భక్తకోటి వేయి కళ్లతో వేచి చూస్తూంటుంది. ఎప్పుడు ఏ నెల టికెట్ల కోటాను విడుదల చేస్తారో? ఆ విషయాన్ని ఎప్పుడో ప్రకటిస్తారో అని ఇకపై ఎదురుచూడాల్సిన అవసరం లేదు.. దళారుల చేతుల్లో కూడా మోస పోనవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ.. మరో గుడ్న్యూస్ అందించింది. ఆన్ లైన్ శ్రీవారి.. దర్శన టికెట్లకు సంబంధించిన క్యాలెండర్ ను టీటీడీ విడుదల చేసింది. ఆ క్యాలెండర్ ప్రకారమే.. భవిష్యత్తులో కూడా.. టీటీడీ నడుచుకోనుంది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. ఈ విధానాన్ని తెచ్చింది. ప్రతినెలా.. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల చేస్తామని.. తిరుమల తిరుపతి దేవస్థానం చెప్పింది. అయితే, ఈ దఫా తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకునే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ విడుదల చేసింది.
శ్రీవారి సేవా టికెట్లు లేదా దర్శన టికెట్ల విడుదల తేదీ.. ఆదివారం వచ్చినట్లయితే.. వాటిని మరుసటి రోజు విడుదల చేస్తారు. ప్రతినెలా 18 నుంచి 20వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన ఆర్జిత సేవల లక్కీ డిప్ కోసం భక్తులు నమోదు చేసుకోవచ్చు. ప్రతి నెలా 20 నుంచి 22వ తేదీ వరకు డిప్లో టికెట్లు పొందిన వాళ్లు డబ్బులు చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవలతోపాటు వర్చువల్ సేవా టికెట్లను 21వ తేదీన విడుదల చేస్తారు. శ్రీవాణి, ఆంగ ప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు 23వ తేదీన విడుదలవుతాయి. అదే విధంగా 300 రూపాయల దర్శన టికెట్ల కోటాను 24న, తిరుపతిలో గదుల కోటాను 25న, తిరుమలలో గదుల కోటాను 26న విడుదల చేయనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రకటన విడుదల చేసింది. ఈ తేదీలను గమనించి సేవా టికెట్లు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని భక్తులకు సూచించింది.