
అమెరికా అధ్యక్షుడు బైడెన్ హత్యకు తెలుగు విద్యార్థి కుట్ర?
- NewsPolitics
- May 24, 2023
- No Comment
- 26
అమెరికా అధ్యక్షుడు జోబైడన్ హత్యకు తెలుగు విద్యార్థి కుట్ర పన్నిన ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. వాషింగ్టన్ డీసీలోని ఆ దేశ అధ్యక్ష భవనం వైట్ హౌస్ పరిసరాల్లో ట్రక్కు బీభత్సం సృష్టించింది. ట్రక్ తో వైట్హౌస్లోకి దూసుకెళ్లిన సాయి వర్షిత్ సెక్యూరిటీ బారికేడ్లను ఢీకొట్టాడు. దాంతో, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ డ్రైవర్ భారత సంతతికి చెందిన తెలుగు కుర్రాడని, అతని పేరు సాయివర్షిత్ కందుల అని భద్రతా సిబ్బంది గుర్తించారు.
సదరు యువకుడిని ప్రశ్నించగా తాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్ని లక్ష్యంగా చేసుకున్నానని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.అమెరికాలోని మిస్సోరి స్టేట్లో ఉంటున్న సాయి వర్షిత్ ..ట్రక్ ను అద్దెకు తీసుకొని వైట్ హౌస్ లో వెళ్లడం సంచలనం రేపుతోంది. అధ్యక్ష భవనం అంటే హై సెక్యూరిటీ ఉంటుంది. అలాంటి చోటుకు ఊహించని విధంగా ఓ తెలుగు విద్యార్థి వెళ్లడం, ఏకంగా బైడెన్ హత్యకు ప్లాన్ చేసినట్లు చెప్పడం నమ్మశక్యంగా అనిపించడం లేదు.
జో బైడెన్ హత్యకు సాయి కుట్ర చేసినట్లు నిర్ధారించిన పోలీసులు..అతని వెనక ఉన్నదెవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బైడెన్ హత్యకు ఆరునెలలుగా ప్లాన్ చేసినట్లు సాయి అంగీకరించాడని పోలీసులు చెబుతున్నారు. సాయివర్షిత్ కందులపై మారణాయుధాల వినియోగం, వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడం, దేశాధ్యక్షుడికి ప్రాణహాని కలిగించేందుకు యత్నించడం, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం తదితర అభియోగాలతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది.