
జగన్లో ఆ భయంతోనే.. “జగనన్నకు చెబుదాం” ఆగిందా..?
- Ap political StoryNewsPolitics
- April 29, 2023
- No Comment
- 49
ఏపీలో ప్రతీ సోమవారం జరిగే “స్పందన” కార్యక్రమానికి బదులుగా “జగనన్నకు చెబుదాం” కార్యక్రమాన్ని తలపెట్టిన జగన్ సర్కార్ పునరాలోచనలో పడింది. “జగనన్నకు చెబుదాం” పేరుతో సీఎంకు ఫోన్లోనే ఫిర్యాదు చేసేలా ప్రోగ్రామ్ను డిజైన్ చేశారు. అయితే..ముఖ్యమంత్రి జగన్ను జనం నిలదీస్తారనే భయంతోనే ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఏప్రిల్ 13నే ప్రారంభం కావాల్సిన “జగనన్నకు చెబుదాం” కార్యక్రమం.. ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
విపక్ష నేతగా జనానికి ముద్దులు పెడుతూ హల్చల్ చేసిన జగన్ రెడ్డి.. సీఎం అయ్యాక తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం అయిపోయారు. సామాన్య ప్రజల మాట అలా ఉంచితే మంత్రులు, ఎమ్మెల్యేలకు సైతం ఆయన దర్శనం దొరకటం లేదు. గత నాలుగేళ్ళుగా ఆయన జనంలోకి వెళ్ళటం పూర్తిగా మానేశారు. ఏదైనా కార్యక్రమాలకు హాజరైనా బ్యారికేడ్లకే ప్రజల్ని పరిమితం చేస్తున్నారు. తాను మాత్రం బుల్లెట్ ప్రూఫ్ బస్సుదిగి బయటకు రావటం లేదు. దీంతో.. జగన్ రెడ్డికి జనానికి మధ్య గ్యాప్ బాగా పెరిగి పోయింది. ఈలోగా ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఎక్కువ కావటంతో.. ఆయన జనంలోకి వెళ్ళే ధైర్యం చేయలేక పోతున్నారు. దీంతో.. “జగనన్నకు చెబుదాం” అనే పేరుతో ఓ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఐప్యాక్ టీమ్ డిజైన్ చేసింది. ప్రజలే నేరుగా సీఎంతో ఫోన్లో ఇంటారాక్ట్ అయ్యి.. సమస్యలు చెప్పుకునేలా దీనిని రూపొందించారు. ఏప్రిల్ 13 నుంచి లాంఛనంగా ప్రారంభించాలని కూడా నిర్ణయించారు. అయితే.. ఇప్పటి వరకు ఆ కార్యక్రమం పట్టాలెక్కలేదు. దీని వెనుక కారణాలేంటని ఆరాతీస్తే.. ఆనేక ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి.
కేవలం బటన్ నొక్కుడు పథకాలకే పరిమితం అయిన జగన్ రెడ్డి…రాష్ట్రంలో అభివృద్ధిని గాలికి వదిలేశారు. రోడ్లు, డ్రైనేజీలు, కరెంట్, తాగునీరు, సాగునీటి వసతులు, ఉద్యోగాల కల్పన వంటి కార్యక్రమాలకు మొండి చేయి చూపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరిగి.. ఆయన ప్రజల్లోకి వెళ్ళే ధైర్యం చేయటం లేదు. జనంలోకి వెళితే నిలదీస్తారనే భయంతో.. కేవలం తాడేపల్లి ప్యాలెస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లు, ప్రెస్ రిలీజ్లకే పరిమితం అయిపోతున్నారు. ఒకవేళ బహిరంగ సభలకు వెళుతున్నా.. రోడ్లకు ఇరువైపులా బ్యారికేడ్లను ఏర్పాటు చేయిస్తున్నారు. జనానికి కనిపిచంకుండా పరదాలు కట్టిస్తున్నారు. సామాన్యులెవరూ తనవైపు రాకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్యే తన పర్యటనలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే జనంలోకి వెళ్ళకుండా.. ఫోన్ ద్వారా పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవ్వాలని సీఎం జగన్ భావించారు.
జగనన్నకు చెబుదాం అనే పేరుతో ఓ కార్యక్రమాన్ని డిజైన్ చేయించారు. అయితే.. వివేకా కేసు చుట్టుముట్టటం.. ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరగటంతో సీఎం వెనుకడుగు వేసినట్టు చెబుతున్నారు. ఒకవేళ ఫోన్ లైన్లో జనం నిలదీస్తూ.. ఆ ఆడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తే.. అంతంత మాత్రంగా ఉన్న పరువు కూడా పోతుందని సీఎం భయపడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ గ్రాఫ్ పాతాళంలోకి పడిపోయింది. జగనన్నకు చెబుదాంలో జనం నిలదీసే ఆడియో టేపులు బయటకు వస్తే.. ప్రభుత్వానికి, పార్టీకి తీరని నష్టం జరగుతుంది. దీంతో.. ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయటం.. లేదా రద్దు చేసుకోవటమే మంచిదనే భావనకు ముఖ్యమంత్రి వచ్చినట్టు చెబుతున్నారు. అందుకే జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమంపై జగన్ రెడ్డి సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల అనంత పర్యటనలో జగన్ కు రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. జనం తిరుగుబాటుతో ముఖ్యమంత్రి రోడ్డెక్కలేని పరిస్థితి నెలకొంది.
మొత్తం మీద.. సీఎం జగన్ రెడ్డి తన ప్రచారానికి వాడుకోవాలని భావించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి ఆదిలోనే హంసపాదు ఎదురౌతోంది. దీని వల్ల వైసీపీ ప్రభుత్వానికి వచ్చే మైలేజ్ కన్నా.. డ్యామేజే ఎక్కువనే భయం సీఎం జగన్ ను వెంటాడుతోంది. మరి… ఈ కార్యక్రమాన్ని జగన్ నిర్వహిస్తారా..? లేక జనాగ్రహానికి భయపడి పూర్తిగా పక్కన పెట్టేస్తారా..? వేచిచూడాలి.