
గేమ్ ఛేంజ్.. మోడీతోనే కేసీఆర్
- NewsPoliticsTelangana Politics
- June 27, 2023
- No Comment
- 22
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ రాష్ట్రంలో బాగా పుంజుకుంటోంది. గులాబీపార్టీ మూడోసారి అధికారంలోకి రావాలంటే… హస్తం పార్టీతో ఈసారి గట్టిగానే చెమటోడ్చాల్సి ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి చాలా మంది నేతలు కాంగ్రెస్ లోకి జంప్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెట్టాల్సిన కేసీఆర్… మహారాష్ట్ర పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణ పేరుతో చేస్తున్న రాజకీయం మామూలుగా లేదు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ టార్గెట్గా చేరికలపై ఫోకస్ పెట్టారు. దాంతో, గులాబీ దళపతి రాష్ట్రానికి వస్తున్నారంటేనే ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్ బీజేపీకి బీటీమ్ గా పనిచేస్తున్నారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి రోడ్డు మార్గాన సుమారు 200 వాహనాల్లో కేసీఆర్ మహారాష్ట్రలో బలప్రదర్శనకు వెళ్లారు.
మొన్నటిదాకా కాషాయపార్టీపై కత్తులు నూరిన కేసీఆర్, కొంతకాలంగా సైలెంట్ అయిపోయారు. కమలనాథులపై ఎక్కడా విమర్శలకు పోవడం లేదు. రాష్ట్ర స్థాయిలో నేతలు తిట్టిపోసుకుంటున్నా , పై స్థాయిలో మాత్రం దోస్త్ మేరా దోస్త్ అని పాట పాడుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో శుక్రవారం పట్నాలో ప్రతిపక్ష పార్టీల మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ కు కేసీఆర్ దూరంగా ఉన్నారు. కానీ, కేంద్రం ఆధ్వర్యంలో మణిపూర్పై జరిగిన అఖిల పక్ష సమావేశానికి మాత్రం కేసీయార్ తన సన్నిహితుడు వినోద్ కుమార్ను పంపించి బీజేపీకి స్నేహ హస్తం జాచారు. ఇక, బీహార్ లో విపక్షాల సమావేశం ఉన్న రోజే ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రులను కలిసిన కేటీఆర్ .. కలవాల్సింది పార్టీలు కాదు ప్రజలని ఓ స్టేట్ మెంట్ ఇచ్చేశారు. దాంతో, బీఆర్ఎస్, బీజేపీలు రెండూ ఒక్కటయ్యాయనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పుడు కేసీఆర్ మహారాష్ట్ర రెండ్రోజుల పర్యటనలో ఎన్సీపీ, కాంగ్రెస్ లను టార్గెట్ చేసుకోవడం ఆ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇంకేముంది, ఆ ఇద్దరినీ టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటోంది.
బీఆర్ఎస్, బీజేపీలు యుద్ధం ఆపేశాయని…. తెలంగాణలోని కాషాయ పార్టీ నేతలే చెబుతున్నారు. కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల… బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండు ఒక్కటేనని ప్రజలు భావిస్తున్నారంటూ… కమలనాథులే అంగీకరిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆప్ మంత్రులిద్దరినీ జైలుపాలు చేసింది బీజేపీ. కానీ, తెలంగాణ విషయానికొచ్చే సరికి కవితను కేవలం విచారణకే పరిమితం చేసింది. అప్పట్లో ఏ క్షణమైనా కవిత అరెస్ట్ అవుతుందని అంతా భావించారు. కానీ, లిక్కర్ స్కామ్ లో కవిత అవకాశాన్ని తమకు అనుకూలంగా మల్చుకున్న బీజేపీ కేసీఆర్ మెడలు వంచింది.