
బీజేపీకి షాక్? పొంగులేటితో రాజగోపాల్ రెడ్డి భేటీ
- NewsPoliticsTelangana Politics
- July 5, 2023
- No Comment
- 22
తెలంగాణ బీజేపీకి షాకింగ్ న్యూస్. కొత్త అధ్యక్షుడిని ప్రకటించిన రోజే బీజేపీ నేత కోమటిరెడ్డి ఝలక్ ఇచ్చారు. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డితో, రాజగోపాల్ రెడ్డి చర్చలు జరపడం తెలంగాణ బీజేపీలో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ ఘర్ వాపసీ నినాదంతో కోమటిరెడ్డి బ్యాక్ టు పెవిలియన్ అంటున్నారు. విభేదాలు పక్కనబెట్టి పనిచేద్దామంటూ రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చిన వెంటనే…పొంగులేటితో రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే ఆయన హస్తం గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లే, ఆయన కాంగ్రెస్ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులతో భేటీ కావడం మరింత బలం చేకూర్చింది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి తిరిగి రావాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ పరిణామాల మధ్య రాజగోపాల్ రెడ్డి పొంగులేటితో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీపై రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలే ఆయన ఈటలతో పాటు ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసి వచ్చారు. వీరి ఒత్తిడి కారణంగానే తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను మార్చి …ఆ స్థానంలో కిషన్ రెడ్డిని పార్టీ నాయకత్వం మార్చినట్టు వార్తలు వచ్చాయి. ఈ సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రస్ వైపు చూడడం చర్చనీయాంశంగా మారింది.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం …తెలంగాణ రాజకీయాలను మార్చేసింది. అప్పటి వరకూ బీజేపీ వైపు మొగ్గుచూపిన నేతలు… కర్ణాటకలో బీజేపీ ఓటమితో కాంగ్రెస్ లోకి క్యూకట్టారు. ఈ క్రమంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూపల్లి కూడా ఈనెల 16న హస్తం పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…మునుగోడు ఉపఎన్నికలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నుంచి బీజేపీలో ఇమడలేకపోతున్న రాజగోపాల్ రడ్డి… పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోవడంతో, మళ్లీ ఆయన సొంతగూటికి చేరాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉన్నందువల్ల రాజగోపాల్ రెడ్డి చేరికకు లైన్ క్లియర్ అయినట్లే కనిపిస్తోంది.
కాంగ్రెస్ కు అడ్డాగా ఉన్న ఖమ్మం గడ్డ పొంగులేటి చేరికతో మరింత బలపడుతోంది. ఇక, రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరితే నల్గొండలో పార్టీ మరింత బలం పుంజుకుంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు ఉత్తమ్, జానారెడ్డి, దామోదర్ రెడ్డి లాంటి బలమైన నేతలున్నారు. ఇక, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ ను కాంగ్రెస్ కు కంచుకోటగా మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే, అక్కడ నాగం జనార్దన్ రెడ్డి, చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డిలతో పాటు జూపల్లి చేరికతో పార్టీ మరింత బలపడుతోందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇలా కాంగ్రెస్ కు గతంలో పట్టున్న ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండల్లో మెజార్టీ స్థానాలు సాధించేందుకు హస్తం పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. అదేవిధంగా ఉత్తర తెలంగాణపైనా గట్టిగా ఫోకస్ పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో 90 స్థానాల్లో గెలిచేలా కార్యచరణ రెడీ చేస్తోంది. అందుకే, ఎక్కడ భేషజాలకు పోకుండా, పట్టింపులు లేకుండా…అందరూ ఏకతాటిపై వెళ్లాలనే నిర్ణయానికి హస్తం పార్టీ నేతలు వచ్చారు.
మొత్తంగా, బీజేపీ అధినాయకత్వం తెలంగాణలో మార్పులు చేసినా…బీఆర్ఎస్తో టై అప్ అయ్యిందనే అనుమానంతో ఆ పార్టీ నేతలు, ప్రజలు ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా మారింది. అందుకే, కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన కొందరు నేతలు తిరిగి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు.