
చంద్రబాబు టూర్లే లక్ష్యంగా వైసీపీ భయంకర కుట్రలు..?
- Ap political StoryNewsPolitics
- April 22, 2023
- No Comment
- 27
వివేకా హత్యకేసు మెడకు చుట్టుకోవటంతో.. పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకుపోయిన వైసీపీ ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీసిందా..?. దీంట్లో భాగంగానే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మంత్రి ఆదిమూలపు సురేష్ అరాచక పర్వానికి తెర తీశారా..? పక్కా వ్యూహంలో భాగంగానే ఆయన చంద్రబాబు టూర్ను టార్గెట్ చేశారా..? అంటే రాజకీయ వర్గాల నుంచి ఔననే సమాధానాలే వస్తున్నాయి. దీని వెనుక ఐ ప్యాక్ స్కెచ్ దాగి ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతకీ.. మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంతగా రెచ్చి పోవటానికి కారణం ఏంటి..? చొక్కా విప్పి మరీ అర్ధనగ్న విన్యాసాలు ఎందుకు చేశారు..? అసలు చంద్రబాయు నాయుడు టూర్ను వైసీపీ శ్రేణులు ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి..? భవిష్యత్లో ఆ పార్టీ “కుట్ర” థియరీ ఎలా ఉండబోతోంది..?
ఓవైపు వివేకా హత్యకేసుతో జగన్ సర్కార్ ఉక్కిరి బిక్కిరి అవుతుండగా.. మరోవైపు ప్రభుత్వ గ్రాఫ్ పాతాళంలోకి పడిపోతోంది. జగన్ మాటలను జనం నమ్మక పోగా.. చంద్రబాబు సభలకు పోటెత్తుతున్నారు. అటు నారాలోకేష్ టూర్కు సైతం బ్రహ్మరథం పడుతున్నారు. ఇక.. వారాహి యాత్రతో పవన్ సీన్లోకి వస్తే.. తమ ఖేల్ ఖతమని అధికార వైసీపీ భయపడుతోంది. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఆ పార్టీకి కళ్ళ ముందు ముళ్ళబాట కనిపిస్తోంది. ఇలాగైతే ఎన్నికల్లో గెలవటం కాదు కదా.. అసలు డిపాజిట్లు కూడా దక్కవనే టెన్షన్ ఆ పార్టీ నాయకత్వాన్ని భయపెడుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు టాప్ టు బాటమ్.. ఇదే అంశం కలవర పెడుతోంది. దీంతో రంగంలోకి దిగిన వైసీపీ “ఐప్యాక్ టీమ్”.. డైవర్షన్ పాలిటిక్స్కు.. ప్రజల్లో అలజడులు సృష్టించేందుకు ప్లాన్ చేసిందని వార్తలు వస్తున్నాయి. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..ఆయన తనయుడు లోకేష్ టూర్లను అడ్డుకోవటమే వీరి ఏకైక లక్ష్యమని చెబుతున్నారు. ఈ క్రమంలోనే దాడులు, అల్లర్లకు పాల్పడటం.. ఓ రకమైన భయోత్పాతాన్ని సృష్టించటమే లక్ష్యంగా ఐప్యాక్ టీమ్స్ ప్లాన్ చేసినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
దీంట్లో భాగంగానే.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో చంద్రబాబునాయుడు కాన్వాయ్పై దాడి జరిగినట్టు కేంద్ర నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. జడ్ ప్లస్ కేటగిరీతో హై సెక్యూరిటీ జోన్లో ఉన్న చంద్రబాబు నాయుడు కాన్వాయ్పై రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ రాళ్ళదాడి చేయించటాన్ని అత్యంత తీవ్రమైన భద్రతా ఉల్లంఘనగా భావిస్తున్నారు. దీని వెనుక భారీ కుట్రదాగి ఉందనే అనేమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సెక్యూరిటీ విధుల్లో ఉన్న కమాండెంట్ సంతోష్ కుమార్ తలకు తీవ్ర గాయాలు కావటాన్ని NSG కేంద్ర కార్యాలయం చాలా సీరియస్గా తీసుకున్నట్టు చెబుతున్నారు. దీనిపై స్తానిక అధికారుల నుంచి నివేదిక కోరినట్టు సమాచారం. మరోవైపు.. ఢిల్లీలోని NSG కార్యాలయానికి స్థానిక అధికారులు నివేదిక పంపినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. మరోవైపు.. పదపదే చంద్రబాబు కాన్వాయ్లో తీవ్రమైన భద్రతా ఉల్లంఘనలు జరుగుతుండటం.. అది కూడా రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలే ఈ దుశ్చర్యలకు పాల్పడుతుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఇక.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మంత్రి ఆదిమూలపు సురేష్ క్రియేట్ చేసిన హైడ్రామా వెనుక కూడా “ఐ ప్యాక్” హస్తం ఉందని అంటున్నారు. చంద్రబాబు గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్ షోలకు జనం భారీ ఎత్తున తరలివచ్చారు. ఎర్రగొండపాలెం లో కూడా భారీ జన సమీకరణకు టీడీపీ శ్రేణులు సమాయత్తం అయ్యాయి. ఎర్రగొండపాలెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్కు సహజంగానే ఇది కలవరపాటుకు గురి చేసింది. దీంతో రంగంలోకి దిగిన వైసీపీ శ్రేణులు ఓ పథకం ప్రకారం నిరసనలకు ప్లాన్ చేశాయి. అల్లరి మూకలతో చంద్రబాబు కాన్వాయ్పై రాళ్ళ దాడికి తెగబడ్డాయి.”దళిత కార్డు” ప్రయోగిస్తూ.. చంద్రబాబు టూర్ను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఐప్యాక్ నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే..మంత్రి ఆదిమూలపు సురేష్.. చొక్క విప్పి మరీ అర్దనగ్న విన్యాసాలకు దిగారని అంటున్నారు. మంత్రి హోదాలో ఉన్నామనే కనీస విచక్షణ మరిచిపోయి.. ఇలా చొక్కా విప్పటం ఏంటని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వీధి రౌఢీలా ప్రవర్తించిన సురేష్ను చూసి ముక్కున వేలేసుకున్నారు.
ఇక.. ఒక్క ఎర్రగొండపాలెం లోనే కాకుండా చంద్రబాబు ఎక్కడకు వెళ్ళినా ఇదే విధంగా అల్లర్లు చేయటానికి ఐప్యాక్ ప్లాన్ చేసిందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలో సైతం చంద్రబాబు టూర్ను వైసీపీ నేతలు టార్గెట్ చేశారని అంటున్నారు. ఏప్రిల్ 26 నుంచి 3 రోజుల పాటు చంద్రబాబు గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి, పెదకూరపాడు, తాడికొండ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా అడ్డుకుంటామని మంత్రి మేరుగ నాగార్జున సైతం ప్రకటించారు. అంటే.. ప్రకాశం జిల్లాలో జరిగిన అరాచకాన్నే గుంటూరు జిల్లాలో రిపీట్ చేస్తామని మంత్రి చెప్పినట్టయ్యింది. మరోవైపు.. త్వరలో ఎర్రగొండపాలెం కు లోకేష్ పాదయాత్ర రానుంది. ఆయన పాదయాత్రలో సైతం ఇదే విధమైన అల్లర్లు, దాడులు చేయలనేది “వైసీపీ-ఐప్యాక్” ప్లాన్గా చెబుతున్నారు. దీంతో చంద్రబాబు, లోకేష్ పర్యటనలకు వస్తున్న జనాదరణను చూసి తట్టుకోలేకై వైసీపీ నేతలు ఇలా దాడులు, అల్లర్లకు ప్లాన్ చేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది.
అసలు ఒకపార్టీ నేతలు చేస్తున్న యాత్రలను… మరో పార్టీ వాళ్ళు అడ్డుకోవటం ఏంటనే ప్రశ్నలు ఈ సందర్బంగా ఉత్పన్నం అవుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇలాగే అడ్డుకుని ఉంటే.. జగన్ రెడ్డి జనంలో తిరగ గలిగేవాడా..? అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు బజారు రౌడీల్లా ప్రవర్తించటాన్ని తప్పు పడుతున్నారు. చంద్రబాబు, లోకేష్ టూర్లను వైసీపీ నేతలు టార్గెట్ చేసిన నేపథ్యంలో.. కేంద్రం జోక్యం చేసుకోవాలని.. వారికి అదనపు భద్రత కల్పించాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. అరాచక శక్తులతో చేతులు కలిపిన వైసీపీ శ్రేణులకు ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరిస్తున్నాయి.
మొత్తం మీద.. తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేకే.. వైసీపీ ఇలా చీప్ ట్రిక్స్ పాల్పడుతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రులే వీధి రౌఢీల్లా ప్రవర్తించటాన్ని రాష్ట్ర ప్రజలు తప్పు పడుతున్నారు. కంచే చేను మేసిన చందంగా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.