
రుషికొండపై..జగన్మాయ..!
- Ap political StoryNewsPolitics
- February 6, 2023
- No Comment
- 86
ఏపీలో సలహాదారులు విశ్వరూపం చూపిస్తున్నట్లుగా ఉన్నారు. ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఏం చేయాలో పరమానందయ్య శిష్యులకు మించి సలహాలిచ్చేస్తున్నరు. తాజాగా వీరి నిర్వాకం … విశాఖ నగరంలోని రుషికొండ విషయంలో బయటపడింది. రుషికొండను బోడి గుండులా మార్చిన జగన్ సర్కార్.. ఇప్పుడు.. అక్కడ అంతా పచ్చగా కనిపించేలా కలరింగ్ ఇస్తోంది.. ఇష్టం వచ్చినట్టు తవ్వేసిన చోట మొత్తం తవ్వినట్లుగా కనిపించకుండా గ్రీన్ కార్పెట్ను అధికారులు రాత్రికి రాత్రి పరిచేశారు. గతంలో తవ్విన చోట.. తవ్వినట్లుగా స్పష్టంగా కనిపించేది. కానీ ఈ గ్రీన్ కార్పెట్ ను పరవడంవల్ల దూరం నుంచి చూసిన వారికి కొండ అంతా పచ్చగా కనిపిస్తోంది. ఈ నిర్వాకం చూసి సోషల్ మీడియాలో జనం నవ్వుకుంటున్నారు.
వైఎస్ వివేకా హత్య కేసులో ఎలా అయితే మసి పూసి మారేడు కాయ చేశారో … ఇప్పుడు బహిరంగంగా కనిపించే రుషికొండ విషయంలోనూ అదే చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నయి. రుషికొండపై గతంలో ఉన్న రిసార్టును కూలగొట్టి కొండను తవ్వేసి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారు. కొండను తవ్వేయడం నిబంధనలకు విరుద్ధమని.. అనుమతించిన దాని కన్నా ఎక్కువ తవ్వేశారని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ జరిపిన హైకోర్టు కేంద్ర పర్యావరణ శాఖ అధికారులతో కమిటీని నియమించాలని ఆదేశించింది. అక్రమ తవ్వకాలను నిగ్గు తేల్చేందుకు సమగ్ర సర్వే చేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఆ విషయం అలా ఉండగా.. రుషి కొండను పూర్తిగా తవ్వేసిన ప్రాంతం జనాలకు చాలా దూరం నుంచే స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో.. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో డ్యామేజ్ కంట్రోల్ కు దిగిన జగన్ సర్కార్.. గ్రీన్ కార్పెట్లను కంకరపై పరిచింది. జగన్ సర్కార్ అతి తెలివి తేటలు చూసిన జనాలు ముక్కున వేలేసు కుంటున్నారు. గ్రీన్ కార్పెట్లు పరిచినా.. ఏపీ ప్రభుత్వం తాను చేసిన తప్పులను కప్పి పుచ్చలేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.