
దళితుల ముసుగులో వైసీపీ కొత్త కుట్రలు..
- Ap political StoryNewsPolitics
- April 25, 2023
- No Comment
- 35
ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తోన్న యాత్రలకు జనం నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇది చూసి ఆందోళన చెందుతోన్న అధికార వైసీపీ అధినేత జగన్ రెడ్డి కొత్త కుట్రలకు తెరలేపారు. ఏపీలోని ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు దళితులను రెచ్చగొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటిపోయినా ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా దళితులకు చేసింది ఏమీ లేదు. దీంతో దళితులపై చంద్రబాబు చేయని వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ దళిత నేతల ముసుగులో కుట్రలు అమలు చేస్తున్నారు. అభివృద్ది, సంక్షేమం పేరు చెప్పుకుంటే వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితులు లేకపోవడంతో, ఐ ప్యాక్ టీం సలహాల మేరకు కులాలను రెచ్చగొట్టి లబ్దిపొందాలని చూస్తున్నారు. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? దళితులపై నిత్యం దాడులు జరుగుతుంటే దళిత నేతలు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? దళితులకు, చంద్రబాబు మధ్య చిచ్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది ఎవరు.
ఏపీలో అధికారాన్ని కాపాడుకునేందుకు, ఏదొకటి చేసి మరోసారి ఎన్నికల్లో నెగ్గేందుకు వైసీపీ అధినేత జగన్ రెడ్డి కొత్త కుట్రలకు తెరలేపారు. ఏపీలో 27 ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు పర్యటనలను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ముందస్తు ప్లాన్ వేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటనలో దళిత మంత్రి ఆదిమూలపు సురేష్ వీరంగం వేశారు. ఇక 26 నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి, పెదకూరపాడు, తాడికొండ నియోజకవర్గాల్లో పర్యటించాలని పక్షం రోజుల కిందటే చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు పర్యటనకు ముందే ఈ మూడు నియోజకవర్గాల్లో రాజకీయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే సత్తెనపల్లిలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అనుమతులు లేవంటూ అర్థరాత్రి తొలగించారు. ఇక తాడికొండ, అమరావతిలో చంద్రబాబుకు వ్యతిరేకంగా వందలాది ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు. ఓ వైపు టీడీపీ నేతల ఫ్లెక్సీలను తొలగిస్తున్న అధికారులు వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ముట్టుకోవడం లేదు. చంద్రబాబును టార్గెట్ చేస్తూ తాడికొండ, అమరావతిలో ఆయన పర్యటనలను దళితుల ముసుగులో అడ్డుకునేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది…
దళితులను చంద్రబాబుపై రెచ్చగొట్టడం ద్వారా వారిని టీడీపీకి దూరం చేయాలని ఐ ప్యాక్ టీం ఇచ్చిన సలహాలను తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా వైసీపీ దళిత నేతలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. కొందరు ఐ ప్యాక్ టీం సభ్యులు చంద్రబాబు పర్యటన సమయంలో వైసీపీ నేతలను దగ్గరుండి నడిపిస్తున్నారు. చంద్రబాబు ప్రయాణం చేసే మార్గాలను ముందే పరిశీలించి, ఏ ప్రాంతంలో రాళ్లు విసరాలి, … ఏ ప్రాంతంలో నినాదాలు చేయాలి. ఏ ప్రాంతంలో చంద్రబాబు కాన్వావ్ వద్దకు దూసుకుపోవాలి అనే విషయాలను ఐ ప్యాక్ టీం దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. చంద్రబాబు పర్యటనకు రక్షణ పెంచాలని ముందుగానే పోలీస్ అధికారులకు విజ్ఙప్తి చేసినా వారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇక చంద్రబాబు పర్యటన రక్షణకు వచ్చిన పోలీసులు కూడా వైసీపీ నేతల కనుసన్నల్లో పనిచేస్తున్నారనేది వాస్తవం. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటనతోనే వైసీపీ నేతల అసలు కుట్ర బయట పడింది.
దేశంలో ఏ సీఎం చేయని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు. సంక్షేమం నిజమే అయితే ప్రజలు మరలా వైసీపీకే పట్టంకడతారుగా? కానీ సొంత సర్వేలు కూడా వైసీపీ అధినేతకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. 93 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేదని ఐ ప్యాక్ టీం తేల్చి చెప్పడంతో సంక్షేమ పథకాలు బెడిసికొట్టాయని అర్థమైంది. సంక్షేమ పథకాల ప్రచారంతో గడప గడపకు వెళుతోన్న మంత్రులు, ఎమ్మెల్యేలను జనం నిలదీస్తున్నారు. కనీస సదుపాయాలను గాలికొదిలేసి బటన్ నొక్కుడు సంక్షేమంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిన జగన్ రెడ్డి, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు దళితులను పావుగా వాడుకుంటున్నారని స్పష్టం అవుతోంది. దళితులను టీడీపీకి దూరం చేసేందుకు అసత్యాలను ప్రచారం చేయడం, చంద్రబాబు, లోకేష్ చేయని వ్యాఖ్యలను అంటగట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇలా దళితులను తమవైపునకు తిప్పుకుంటే వచ్చే ఎన్నికల్లో మైనారిటీల సహకారంతో నెగ్గవచ్చనే వ్యూహాలు అమలు చేస్తున్నారు. జగన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో దళితులను ఊచకోతకోసి, ఇప్పుడు దళితోద్దారకుడిలా ప్రచారం చేసుకోవడాన్ని దళిత సంఘాలు ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ దమన నీతిని ప్రశ్నించిన దళిత సంఘాల నేతలకు సీఐడీతో నోటీసులు జారీ చేయించారు. కేంద్ర నేర గణాంకాల ప్రకారం ఏపీలో దళితులపై గడచిన నాలుగేళ్లోనే 400 శాతం నేరాలు పెరిగాయనే విషయం ఆందోళన కలిగిస్తోంది. అయినా వైసీపీ అధినేత మాత్రం దళితుల సంక్షేమం మాతోనే సాధ్యం అయింది అంటూ భారీ ప్రచారానికి తెరలేపారు.
వైసీపీ ప్రభుత్వ అరాచకాలను దళితులు అర్థం చేసుకుంటున్నారు. వైసీపీ నేతలు ఎంతగా రెచ్చగొట్టినా ఒక్క దళిత సంఘం కూడా చంద్రబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. చేసేది లేక స్వయంగా మంత్రి ఆదిమూలపు సురేష్ చొక్కా విప్పి పరువు పోగొట్టుకున్నారు. దళితులు నిజంగా చంద్రబాబును వ్యతిరేకిస్తే ప్రజల్లో తిరగగలరా? వైసీపీ నేతలు కిరాయి గూండాలతో నాలుగు రాళ్లు వేయించినంత మాత్రాన, చంద్రబాబు పర్యటనలు అడ్డుకునే ప్రయత్నాలు ఫలించవు. దళితులు అమాయకులు కాదు. వారిలో అనేక మంది చదువుకున్న మేథావులున్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఏం జరుగుతోందో అంతా వారు గమనిస్తూనే ఉన్నారు. కుట్రలు చేసి చంద్రబాబుపై దళిత వ్యతిరేకి అంటూ విషం చిమ్మితే, చివరకు అదే వారికి ఉరితాడవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.