
నారా లోకేష్ యువగళం @100 Days
- Ap political StoryNewsPolitics
- May 15, 2023
- No Comment
- 28
ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా.. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరో మైలురాయిని అందుకుంది. జనగళమే యువగళమై సాగుతున్న లోకేష్ పాదయాత్ర 100 రోజులకు చేరుకుంది. జగన్ రెడ్డి అవినీతి, అరాచక పాలనను క్షేత్రస్థాయిలో ఎండగడుతూ, ప్రజల సాధకబాధలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు లోకేష్. 400రోజుల్లో 4వేల కిలోమీటర్లకు చేరుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలను చైతన్యపరుస్తూ సాగిన తొలి మజిలీ విజయవంతంగా ముగిసింది. జనవరి 27వతేదీన కుప్పంలో ప్రారంభమైన యువగళం యాత్ర…. ఇప్పటివరకు 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 1269 కి.మీ. మేర సాగింది.
లోకేష్ పాదయాత్ర 100వ రోజు సందర్భంగా యువతకు సంబంధించిన మ్యానిఫెస్టోను విడుదల చేయన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ పాలనలో రాష్ట్రం భ్రష్టుపట్టిపోయింది. జగన్ రెడ్డి వాగ్దానభంగం కారణంగా…రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ యువత అల్లాడుతున్నారు. ఈ క్రమంలో యువతను ఆదుకునే దిశగా వారి కోసం ప్రత్యేక మ్యానిఫెస్టోను టీడీపీ సిద్ధం చేసింది. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూ వారికి ఓ స్పష్టమైన హామీ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది.
రోజురోజుకు యువగళం పాదయాత్రకు ప్రజలనుంచి వస్తున్న అనూహ్య స్పందన అధికారపార్టీలో వణుకు పుట్టిస్తోంది. దారిడిపొడవునా జనం యువనేతకు నీరాజనాలు పడుతూ తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెడుతున్నారు. అందరికీ అండగా ఉంటామనే భరోసా ఇస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతున్నారు లోకేష్. మొత్తం వందరోజుల సుదీర్ఘ పాదయాత్రలో లోకేష్… 32 బహిరంగసభలు, వివిధవర్గాలతో 87 ముఖాముఖి కార్యక్రమాలు, హలో లోకేష్ పేరిట 4 ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రసంగించారు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 45రోజులు, ఉమ్మడి అనంతపురంలో 9 నియోజకవర్గాల్లో 23 రోజులు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 11నియోజకవర్గాల్లో 32 రోజులు యువగళం పాదయాత్ర కొనసాగింది. 100 రోజుల పాదయాత్రలో రాతపూర్వకంగా యువనేతకు 1900 వినతిపత్రాలు అందాయి.
వైసీపీ సైకోమూకలు, పోలీసులు లోకేష్ పాదయాత్రకు ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. అన్నీ ఎదుర్కొని ముందుకు నడుస్తున్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం, దోపిడీ పాలనను తరిమికొట్టేందుకు… వర్షం కురిసినా, మండుటెండలో కాళ్లకు బొబ్బలొచ్చినా విరామం లేకుండా అలుపెరగని యోధుడిలా లోకేష్ ముందుకెళ్తున్నారు. అనివార్య పరిస్థితుల్లో మినహా యువగళం ఎలాంటి బ్రేకులు లేకుండా సాగుతోంది.
లోకేష్ యువగళం పాదయాత్ర జగన్ రెడ్డి గుండెళ్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది. ఆయా నియోజకవర్గాల్లో ఒకచోట బహిరంగసభ నిర్వహిస్తూ…. జగన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి బాగోతాన్ని బయటపెడుతూ చీల్చిచెండాడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల దోపిడీ దందాలను ఆధారాలతో సహా ప్రజల ముందుంచుతుండడంతో అధికార పార్టీ నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. లోకేష్ పాదయాత్ర చేస్తున్న సమయంలోనే.. రాష్ట్రవ్యాప్తంగా 9జిల్లాలు, 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన 3పట్టభద్రుల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. యువగళం పాదయాత్ర దారిలో టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు, జగన్ రెడ్డి వైఫల్యాలను ఎత్తిచూపుతూ లోకేష్ విసురుతున్న సెల్ఫీ ఛాలెంజ్ అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోవైపు, ప్రతిరోజూ తనను కలవడానికి వచ్చే కార్యకర్తలు, అభిమానులతో సెల్ఫీ విత్ లోకేష్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి అనూహ్య ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకు యువనేత లోకేష్ 1.40లక్షలమంది అభిమానులతో ఫోటోలు దిగారు.
పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తూ వారి సమస్యలపై యువనేత లోకేష్ లోతైన అధ్యయనం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆయావర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని అధికారంలోకి వచ్చాక తాము ఏం చేయబోతున్నారో స్పష్టం చేస్తున్నారు. రైతులు, యువత, మహిళలు, ముస్లింలు, బిసిలు, ఎస్సీలు, ఎస్టీలు, వ్యాపారులు, ఐటి ప్రొఫెషనల్స్ తదితర వర్గాలతో యువనేత సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు.
బిసిల రక్షణకు ఎస్సీ, ఎస్టీ తరహా చట్టం, ముస్లింలకు ఇస్లామిక్ బ్యాంక్, వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు, చేనేతలు, రజక వృత్తి పనివారికి ఉచిత విద్యుత్ వంటి హామీలు ఇవ్వడంతో ఆయా వర్గాలు ఆనందం వ్యక్తంచేస్తున్నాయి. ఇక, పాదయాత్ర నిర్వహించేటప్పుడు ప్రతిజిల్లాలో ఒకచోట నిర్వహించే హలో లోకేష్ కార్యక్రమానికి వివిధ వర్గాల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. పాదయాత్ర సందర్భంగా జీవితంలో తీవ్రంగా దెబ్బతిన్న వారికి లోకేష్ చేస్తున్న ఆర్థికసాయం ఆయనలోని మానవీయ కోణానికి అద్దం పడుతోంది.
యువగళం పాదయాత్ర సందర్భంగా యువనేత నారా లోకేష్ సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రతి వందకిలోమీటర్ల మజిలీలో ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తూ… తాము అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో సంబంధిత అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటిస్తున్నారు. ఇప్పటివరకు ప్రతి వంద కిలోమీటర్లకు ఒకటి చొప్పున 12 అభివృద్ధి కార్యక్రమాలకు యువనేత లోకేష్ శిలాఫలకాలను ఆవిష్కరించారు.
మొత్తంగా, అభివృద్ధిని గాలికొదిలేసి, రాష్ట్రాన్ని లూటీ చేస్తూ అన్ని వర్గాల ప్రజలను జలగలా పీడిస్తున్న జగన్ రెడ్డి సైకో పాలనపై తీవ్ర ప్రజావ్యతిరేకత కనిపిస్తోంది. జనగళమే తన గళమై లోకేష్ ఎక్కడిక్కడ నిలదీస్తుండడంతో ప్రజల్లో చైతన్యం వస్తోంది. సైకో పాలనను పారదోలి సైకిల్ పాలన తెచ్చుకుంటామని ప్రతీ ఒక్కరూ నినదిస్తున్నారు.